నాగర్కర్నూల్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. విద్యాశాఖ మంగళవారం వెల్లడించిన ఫలితాల్లో రాష్ట్రంలోనే నారాయణపేట 15వ స్థానంలో నిలువగా, గద్వాల 32వ స్థానంలో నిలిచింది. ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలను సాధించిన ఉపాధ్యాయులు, విద్యార్థులను జిల్లాల ఉన్నతాధికారులు అభినందించారు.
గత మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ముందస్తుగా పరీక్షలు జరుగగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రుల ఉత్కంఠకు తెరపడింది. ఫలితాల్లో నిర్మల్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలువగా.. నారాయణపేట 93.13శాతంతో 15వ స్థానంలో.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటిస్థానంలో నిలిచింది. నాగర్కర్నూల్ (91.57 శాతం) 23వ స్థానం, మహబూబ్నగర్ (89.47) 28వ స్థానంలో, వనపర్తి(86.93) 29వ స్థానంలో, గద్వాల (81.38) 32వ స్థానంలో నిలిచాయి. ఐదు జిల్లాల్లోనూ బాలికలే అధిక శాతం ఉత్తీర్ణత సాధించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులతోపాటు హెచ్ఎంలు, ఉపాధ్యాయులను డీఈవోలు, కలెక్టర్లు అభినందించారు. నాగర్కర్నూల్జిల్లాలో 78 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. గతేడాది కంటే 1.5శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలతో పాటు రీ కౌంటింగ్, సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా విద్యాశాఖ ప్రకటించింది. పదిహేను రోజుల్లో సబ్జెక్టుకు రూ.500చొప్పున ఫీజు చెల్లించి రీకౌంటింగ్ చేయించుకోవచ్చు. జవాబు పత్రం ఫొటో కాపీ కోసం రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. ఇక సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు ఉదయం 9:30 నుంచి 12:30గంటల వరకు నిర్వహించనున్నారు. వందశాతం ఉత్తీర్ణత కోసం విద్యాశాఖ చేపట్టిన చర్యలు పూర్తిస్థాయిలో ఫలించలేదు. నారాయణపేట 15వ స్థానంలో నిలువగా.. మిగిలిన నాలుగు జిల్లాలో 20కంటే దిగువ స్థానంలో పడిపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మంచిగా చదివే విద్యార్థులపై శ్రద్ధ ఉంచి.. వెనుకబడిన విద్యార్థులను పట్టించుకోకపోవడానికి ఉమ్మడి పాలమూరు ఫలితాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు సైతం ఇదే ఒరవడిని కొనసాగించాయి.