న్యూఢిల్లీ : వైద్యులు నిర్భయంగా పని చేసే వాతావరణం కల్పించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఏఎంఏ) డిమాండ్ చేసింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరింది. ఈ మేరకు సోమవారం ప్రధానికి లేఖ రాసింది. వైద్యులపై నిరంతరం కొనసాగుతున్న శారీరక, మానసిక దాడిని.. అలాగే స్వార్థ ప్రయోజనాలున్న కొంత మంది వ్యక్తులు ఆధునిక వైద్యం, వ్యాక్సినేషన్కు వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రధాని జోక్యం అవసరమని ఐఎంఏ లేఖలో పేర్కొంది.
కొవిడ్ మహమ్మారిపై పోరాడటానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ డ్రైవ్కు వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ఏ వ్యక్తి అయినా.. అంటువ్యాధుల చట్టం, విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఇటీవల అసోంలో కొవిడ్ కేర్ సెంటర్లో ఓ యువ వైద్యుడిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. అలాగే బాబా రాందేవ్ అల్లోపతి వైద్యంపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఖండించిన ఐఎంఏ ఆయనపై చర్యలకు డిమాండ్ చేస్తూ జూన్ 1న బ్లాక్ డేగా పాటించిన విషయం విధితమే. ఈ క్రమంలోనే ప్రధానికి ఐఎంఏ లేఖ రాసినట్లుగా తెలుస్తోంది.