దామరచర్ల, ఆగస్టు 03 : స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలంలో గల యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద పలు గ్రామాల వాసులు సోమవారం ధర్నా నిర్వహించారు. మండలంలోని తాళ్లవీరప్పగూడెం, సాత్ తండా, వీర్లపాలెం, శాంతినగర్, తిమ్మాపురం, నరసాపురం గ్రామస్తులు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించి వైటీపీఎస్ గేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. పవర్ ప్లాంట్ ఏర్పాటు దశలో నాటి ప్రభుత్వం తాము సాగు చేసుకుంటున్న భూమిని తీసుకున్నారని, అందుకు నష్ట పరిహారం ఇవ్వడంతో పాటు తమకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.
నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు పలుమార్లు విన్నవించినా తమ సమస్య పరిష్కరించలేదన్నారు. సుమారు 270 మంది ఎన్క్రోచర్లు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని, బడుగు, బలహీన వర్గాలు, సన్న, చిన్నకారు రైతులు ఎన్నో ఏండ్లుగా భూములపై ఆధారపడి ఉన్నప్పటికీ ప్రాంత అభివృద్ధి కోసం భూములు త్యాగం చేసినట్లు తెలిపారు. కుల వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కల్లు గీత కార్మికులు తమ తాటి వనాలు ప్లాంట్ కింద పోవడంతో రోడ్డున పడ్డారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమకు ఉద్యోగ అవకాశం కల్పించాలని లేకుంటే ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

ఉద్యోగాలు ఇవ్వాలని వైటీపీఎస్ వద్ద పలు గ్రామాల ప్రజలు ధర్నా