హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వివిధ వేరియంట్ల రూపంలో భయాందోళనలకు గురిచేస్తున్నది. మహారాష్ట్ర వైరస్ -2 (డెల్టా) రాష్ట్రంలో వేగంగా వ్యాప్తి చెందుతున్నది. మొన్నటి వరకు ఉత్తర తెలంగాణలో ఎక్కువగా కనిపించిన ఈ వైరస్ రకం ఇప్పుడు దక్షిణాదిలోనూ బాగా వ్యాప్తి చెందినట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో మొదట్లో మహారాష్ట్ర వేరియంట్-1 (కప్పా) ఎక్కువగా ఉండగా, ఇప్పుడది క్రమంగా తగ్గుముఖం పట్టింది. గ్లోబల్ ఇనీషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్ఫ్లూయేంజా డేటా (జీఎస్ఐఏఐడీ) ప్రకారం ఏప్రిల్ నెలలో తెలంగాణలో 400 మందిలో వివిధ వేరియంట్లపై పరిశోధన జరుపగా, డెల్టా వేరియంట్ 50%గా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది.
కప్పా వేరియంట్ 18%గా ఉన్నట్టు తేలింది. అయితే మే నెలలో జరిగిన పరిశోధన ప్రకారం, డెల్టా వేరియంట్ 90%కి చేరగా, కప్పా కేవలం 6%కే పరిమితమైంది. శంషాబాద్ ఎయిర్పోర్టు పరిధిలో ఏప్రిల్ నెలలో 136 మందిలో పరిశోధన చేయగా, అధికంగా 18% మందిలో (సౌతాఫ్రికా వేరియంట్) బీటా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఇదే మే నెలలో జరిపిన పరిశోధనలో ఆల్ఫా (యూకే వేరియంట్) 13%కి చేరింది. బీటా 4%, డెల్టా 11%గా ఉన్నట్టు తేలింది. మొత్తంగా బలమైన మహారాష్ట్ర వేరియంట్ రాష్ట్రమంతటా వ్యాపించిందని, అందుకే రికవరీ ఆలస్యంగా ఉంటున్నదని వైద్యులు చెప్తున్నారు.
కోవిడ్ జాగ్రత్తలు తూచా తప్పక పాటించడం, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు టీకాలు వేసుకోవడం వల్ల ఏ రకమైన వేరియంట్ నుంచైనా రక్షణ పొందవచ్చని సూచిస్తున్నారు. టీకాలు వేసుకోవడం వల్ల వైరస్ సోకినప్పటికీ స్వల్ప లక్షణాలతో బయటపడుతున్నారని, ప్రతి ఒక్కరు టీకాలు వేసుకోవాలని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి క్రిటికల్ కేర్ హెడ్ డాక్టర్ కిరణ్ మాదాల తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవీషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు బలమైన మహారాష్ట్ర వేరియంట్-2 పై కూడా సమర్థవంతంగా పని చేస్తున్నట్టు నిర్ధారణ అయ్యిందని వివరించారు. తమ ఆసుపత్రిలోని పేషెంట్లపై అధ్యయనం చేసి దీనిని గుర్తించినట్టు చెప్పారు.