IND vs ZIM : వరసగా రెండు సిరీస్లలో క్లీన్స్వీప్కు గురైన భారత జట్టు పంజా విసిరింది. ఛాంపియన్ ఆటతో దుమ్మురేపి జింబాబ్వేను వైట్వాష్ చేసి తామేంటో నిరూపించింది. నామమాత్రమైన మూడో టీ20లో వైభవ్ సూర్యవంశీ(81) పిడుగల్లే విరుచుకుపడగా.. బంతితో మయాంక్ యాదవ్(3-29) ఆతిథ్య జట్టును దెబ్బకొట్టాడు. టాపార్డర్ వైఫల్యంతో ఏదిశలోనూ లక్ష్యం దిశగా సాగని జింబాబ్వే రియాన్ బర్ల్(54 నాటౌట్)అర్ధశతకంతో రాణించగా ఆలౌట్ ప్రమాదం తప్పించుకున్నా హ్యాట్రిక్ ఓటమితో సిరీస్ సమర్పించుకుంది.
టీ20 ఫార్మాట్లో మళ్లీ జోరందుకున్న భారత జట్టు 3-0తో జింబాబ్వేపై సిరీస్ గెలుపొందింది. వరసగా రెండు మ్యాచుల్లో విజయంతో క్లీన్స్వీప్పై కన్నేసిన టీమిండియా టాప్ గేర్లో ఆడి ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. హరారే స్పోర్ట్స్ క్లబ్లో తొలుత వైభవ్ సూర్యవంశీ(81) తుఫాన్ ఇన్నింగ్స్తో భయపెట్టగా.. అనంతరం బంతితో మయాంక్ యాదవ్(3-29) వణికించాడు. టాపార్డర్ కుప్పకూలడంతో పవర్ ప్లేలోనే ఓటమి అంచున నిలిచిన జింబాబ్వే 157కే పరిమితమైంది. దాంతో, ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో ఓటములతో విమర్శలపాలైన శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్గా మొట్టమొదటి సిరీస్ గెలిచి నవ్వు ముఖం పెట్టాడు.
Back-to-back strikes 👊
Yash Thakur with a double blow to put #TeamIndia on top 👏👏
Updates ▶️ https://t.co/oApMpI6eRc#TeamIndia | #ZIMvIND pic.twitter.com/D5uFbhCEiq
— BCCI (@BCCI) July 26, 2026
భారీ ఛేదనలో మయాంక్ యాదవ్(3-29) తొలి బంతికే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్(0)ను వెనక్కి పంపాడు. ఆచితూచి ఆడుతున్న డియాన్ మోయర్స్(19), సికిందర్ రజా(0) లను యశ్ ఠాకూర్ ఒకే ఓవర్లో ఔట్ చేశాడు. ఈ ఇద్దరిని వరస బంతుల్లో పెవిలియన్ చేర్చిన యశ్ హ్యాట్రిక్పై నిలిచాడు. కానీ, రియాన్ బర్ల్(54 నాటౌట్) వస్తూనే బౌండరీ సాధించాడు. బర్ల్తో వికెట్ కాచుకున్న బెన్ కరాన్(20)ను బిష్ణోయ్ బోల్తా కొట్టించగా ఆతిథ్య జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓవైపు వికెట్లు పడుతున్నా మధ్వేరా(28)తో కలిసి ఒంటరిపోరాటం చేసిన బర్ల్ అర్ధశతకంతో అజేయంగా నిలిచాడు. జింబాబ్వే 157కే పరిమితవ్వడంతో 35 పరుగుల తేడాతో టీమిండియా విక్టరీ కొట్టింది.
టాస్ గెలిచిన బ్యాటింగ్ తీసుకున్న భారత జట్టుకు శుభారంభ దక్కలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ(2) మరోసారి ముజరబని ఓవర్లో వెనుదిరగగా.. వైభవ్ సూర్యవంశీ(81), ఇషాన్ కిషన్(29) కీలక భాగస్వామ్యం నిర్మించారు. పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 64 రన్స్ చేసింది. జింబాబ్వే బౌలర్లపై అటాకింగ్ గేమ్తో విరుచుకుపడిన ఆడిన ఈ ద్వయం హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ క్రమంలోనే వైభవ్ అంతర్జాతీయ టీ20ల్లో రెండో అర్ధ శతకం సాధించాడు.
వైభవ్ సూర్యవంశీ(81)

సికిందర్ రజా ఓవర్లో ఇషాన్ బౌల్డయ్యాక.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(27)తో కలిసి చెలరేగాడు వైభవ్. సిక్సర్లతో చెలరేగుతూ శతకానికి చేరువైన అతడిని మధ్వీరె పెవిలియన్ చేర్చగా జింబాబ్వే బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం తిలక్ వర్మ(11 నాటౌట్) జతగా గేర్ మార్చాలనుకున్న అయ్యర్నుఎవాన్స్ బోల్తా కొట్టించాడు. రింకూ సింగ్(25) రెడు ఫోర్లు, ఒక సిక్సర్తో మెరవగా టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు
చేసింది.