కౌలాలంపూర్, మలేషియా: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ మలేషియా (BRS Malaysia) ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ ఇచ్చిన “Gift A Smile” పిలుపు మేరకు ఆయన పుట్టిన రోజున వేడుకలు, కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలకు బదులుగా అవసరమైన వారికి చేయూతనిచ్చారు. కేటీఆర్ ఆలోచనకు అనుగుణంగా.. రాజధాని కౌలాలంపూర్లోని ఓ అనాథ శరణాలయంలో చిన్నారులతో కలిసి బీఆర్ఎస్ మలేషియా సభ్యులు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని చేపట్టారు.
కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన “Gift A Smile” కార్యక్రమంలో బీఆర్ఎస్ మలేషియా సభ్యులు అనాథ చిన్నారులకు పండ్లు, స్టేషనరీ సామగ్రిని పంపిణీ చేశారు. అలానే.. శరణాలయ నిర్వహణకు భారీగా ఆర్థిక సహాయాన్ని అందించారు. తమ అభిమాన నాయకుడు కేటీఆర్ జన్మదినాన చిన్నారులతో ఆప్యాయంగా గడుపుతూ, వారి ముఖాల్లో చిరునవ్వులు నింపడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు మారుతి కుర్మ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం కేటీఆర్ జన్మదినాన సేవా కార్యక్రమాలు చేపట్టడం తమకు ఎంతో గర్వకారణమని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న కేటీఆర్ సందేశాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ మలేషియా కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలనే కేటీఆర్ సంకల్పానికి అనుగుణంగా నిర్వహించిన ఈ “Gift A Smile” కార్యక్రమం అనాథ చిన్నారులకు ఆనందాన్ని పంచడమే కాకుండా, సేవా భావాన్ని చాటిచెప్పి నలుగురికి ఆదర్శంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మలేషియా వ్యవస్థాపకులు చిట్టి చిరుత, ఉపాధ్యక్షుడు అరుణ్ మునిగల, కార్యదర్శి సందీప్ కుమార్ లగిశెట్టి, కమిటీ సభ్యులు సత్యనారాయణరావు నడిపెల్లి, హరీష్ గుడిపాటి, సురేష్, శ్యామ్, పూర్ణచందర్ రావు, క్రాంతి, అభినయ్, కృష్ణ, సందీప్ గాజెంగి, గౌతమ్, శేషి తదితరులు పాల్గొన్నారు.