అమరావతి : కరోనాకు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేటి నుంచి ప్రారంభం కానుంది. సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన ప్రజలకు సోమవారం నుంచి పంపిణీ చేస్తున్నామని, కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారని ఆనందయ్య తెలిపారు. అయితే, మందు కోసం ఎవరూ కృష్ణపట్నానికి ఎవరూ రావొద్దని కోరారు. ఆయా నియోజకవర్గాల్లోని పాజిటివ్గా పరీక్షించిన బాధితుల ఇండ్ల వద్దకే మందును పంపిణీ చేస్తామని తెలిపారు. తొలి విడుతలో సర్వేపల్లి నియోజకవర్గంలోనే ఇంటింటికీ పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.
ఆ తర్వాత ఏపీ, తెలంగాణలోని అన్ని జిల్లాలకు పంపిణీ చేస్తామని చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి కృష్ణపట్నానికి వచ్చి ఇబ్బందులు పడొద్దని సూచించారు. అధికారుల వద్ద పేర్ల నమోదు చేసుకోవాలని సూచించారు. కొవిడ్ నిబంధనల ప్రకారమే మందు పంపిణీ జరుగుతుందన్నారు. ఆనందయ్య మందు కోసం కృష్ణపట్నానికి పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో ఆయుష్ అనుమతి కోసం గత నెల 21న మందు పంపిణీని నిలిపివేశారు. ఆయుష్ కంటిలో వేసే మందు మినహా మిగితా మందులకు అనుమతి ఇవ్వడంతో సోమవారం నుంచి మందు పంపిణీ ప్రారంభమవుతోంది.