న్యూఢిల్లీ : భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయిత్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్తో పోల్చారు. తనకు వ్యతిరేకంగా ఎవరూ నోరు మెదపకుండా మోదీ చేస్తున్నారని ఆరోపించారు. మోదీని ‘రాజా’ అని సంభోదిస్తూ.. ‘రాజావారు మిమ్మల్ని శిక్షలకు గురిచేస్తుంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా తమ గళం వినిపిస్తే, నార్త్ కొరియాలో మాదిరిగానే వాళ్లను శిక్షిస్తుంటారు’ అంటూ ట్వీట్ చేశారు.
ద్రవ్యోల్భణం బాగా పెరిగిపోయిందని, అదేంటని ఎవరైనా నిలదీస్తే మాత్రం వారిని ఆయన శిక్షిస్తారని, రాజాకు వ్యతిరేకంగా మాట్లాడటమంటే శిక్షకు సిద్ధపడడమే’ అని అన్నారు. మూడు సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి, కనీస మద్దతు ధరపై చట్టం చేయాల్సిందేనని రైతు నాయకుడు స్పష్టం చేశారు. మూడు వ్యవసాయ చట్టాలపై రైతులతో చర్చలను కేంద్రం తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంపైనే చర్చ జరగాలన్నారు. రైతుల డిమాండ్లను నెరవేర్చే వరకు ఇండ్లకు తిరిగి వెళ్లే ప్రశ్నే లేదని చెప్పారు.