దుమ్ముగూడెం, చర్ల మండలాల రైతులకు జరగాల్సిన నష్టం జరిగిపోయాక స్పందించారు అధికారులు. గోదావరిపై దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నిల్వ ఉండే నీటి ఆధారంతో ఆ ప్రాంత ఎగువన సుమారు వెయ్యి ఎకరాలకు పైగా రైతులు వరిసాగు చేస్తుంటారు. ఈ ఏడాది యాసంగి పంటకు కావాల్సిన నీరు గోదారిలో లేకపోవడంతో పంటలు ఎండిపోయి చాలామంది నష్టపోయారు. అయితే అప్పుడు రైతులు నీరు ఇవ్వండి మహాప్రభో అని మొత్తుకున్నా అధికారులు ఏమాత్రం స్పందించలేదు. కానీ వారం రోజులుగా దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద గోదారిలో నీరు పుష్కలంగా కనిపిస్తుండడంతో రైతుల గుండె తరుక్కుపోతున్నది. ఈ నీరు అప్పుడే ఇచ్చిఉంటే పంటలు ఎండిపోయేవికావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అధికారుల తీరు ఉందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
గోదావరి నదిలో నీరు నిరంతరం పారుతూ ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుచూపుతో దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద మరమ్మతులు చేపట్టి నీటిని నిల్వ చేసి ఈ ప్రాంత ఆయకట్టు రైతుల పంటలకు సాగునీరు అందించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెలరోజుల్లోనే ఆనకట్ట వద్ద నీటిని నిల్వలు తగ్గిపోయాయి. ఎగువ ప్రాంతం నుంచి గోదావరిలోకి నీరు సకాలంలో రాకపోవడంతో దుమ్ముగూడెం, చర్ల మండలాలకు చెందిన సుమారు వెయ్యి ఎకరాల ఆయకట్టు రైతులు యాసంగిలో ఇబ్బందులు పడ్డారు. నీరు లేకపోవడంతో చేతికి వచ్చిన పంటలు ఎండిపోయాయి. ఈ పరిస్థితులపై ఈ నెల 4వ తేదీన నమస్తే తెలంగాణ ‘ఎడారి.. గోదారి’ అనే శీర్షికతో కథనం ప్రచురించింది. అయితే తాజాగా సంబంధితశాఖ అధికారుల సమీక్షలు ఏర్పాటు చేసుకుని నీటి విడుదలకు సంబంధించి చర్చలు జరపడంతో శ్రీరామనవమి తర్వాత మొదటిగా 1000 నుంచి 1500 క్యూసెక్కుల నీటిని ఏటూరు నాగారంలోని తుపాకుల బ్యారేజ్(సమ్మక్క, సారక్క బ్యారేజీ) నుంచి దిగువ ప్రాంతానికి వదిలారు. దీంతో దుమ్ముగూడెం ఆనకట్టకు నీరు పుష్కలంగా చేరింది. ఇప్పుడు గోదావరిలో నీరు పుష్కలంగా ఉంది.. కానీ పంటకాలం పూర్తికావడంతో రైతులకు ప్రస్తుతం ఆ నీటితో ఎలాంటి ఉపయోగంలేకుండా పోయింది. పంటల సమయంలో మోటర్లకు నీరు అందకపోవడంతో చాలామంది రైతులు నష్టపోయారు. కొంతమంది రైతులు మాత్రమే గోదావరిలో ఇంజన్లు పెట్టి నీటిని తోడుకుని పంటలను అరకొరగా గట్టెక్కించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుచూపు కొరవడడంతోపాటు సంబంధితశాఖల అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం, నీటి విడుదల ఏ మేరకు వదలాలో తెలియక సమీక్షల్లో సైతం చర్చించుకోలేక ఆలస్యంకావడంతో అప్పటికే చర్ల, దుమ్ముగూడెం మండలాల రైతుల పంటలకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు గోదావరికి నీరు ఎగువ నుంచి వచ్చినా ఆ నీటి వల్ల ఆయకట్టు రైతులకు ఎలాంటి ప్రయోజనంలేదని కొందరు రైతులు బహిరంగంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రైతుల బాధలను గుర్తించి రాబోయే కాలంలో పంటలకు సరిపడా నీటి నిల్వలను ఉంచేలా అధికారులు చొరవ చూపాలని రెండు మండలాల రైతులు కోరుతున్నారు.
గోదావరిలోని నీరు ప్రగళ్లపల్లి ఎత్తిపోతల పథకానికి అందకపోవడంతో పంటలు ఎండిపోయాయి. ఆయకట్టు పరిధిలో నేను మూడు ఎకరాల వరి సాగు చేశాను. నీరు లేకపోవడంతో సుమారు ఎకరంన్నర పంట నష్టపోయాను. ఇప్పుడు గోదావరికి ఎగువ నుంచి నీరు వచ్చాయ్.. కానీ ఉపయోగంలేకుండా పోయింది. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
రెండు ఎకరాలు సీడ్ వరి సాగుచేశాను. పంట ఏపుగా ఎదుగుతున్న సమయంలో గోదావరిలో నీరు అడుగంటిపోయింది. లిఫ్ట్కు సరిగా నీటి సరఫరా జరగకపోవడంతో రెండెకరాల పంట నష్టపోయాను. ప్రభుత్వం పంట నష్టపరిహారం చెల్లించాలి. భవిష్యత్లో రైతులకు ఇలా జరగకుండా చూడాలి.
మూడు ఎకరాల్లో వరి సాగు చేశాను. పంట కోత సమయంలో చివరి తడి నీరు అస్సలు అందలేదు. ఎకరంన్నర పంట పూర్తిగా ఎండిపోయి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. సుమారు రూ.70 వేలు నష్టపోయా. రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముందుచూపు లేకపోవడంతో ప్రగళ్లపల్లి లిఫ్ట్ ఆయకట్టు పరిధిలో చాలావరకు రైతులు పంటలు ఎండిపోయి నష్టపోయారు.