దోమకొండ, మే 1: పదేండ్ల పాలనలో కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, అవన్నీ ప్రస్తుతం మన కండ్ల ముందున్నాయని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్.. ఒక్క హామీని కూడా అమలు చేయాలేదన్నారు. పాలిచ్చే బర్రెను దూరం చేసుకొని దొడ్డుగా ఉన్నదని గొడ్డు బర్రెను తెచ్చుకోవద్దని ప్రజలను కోరారు. కాంగ్రెస్, బీజేపీలు అనేక హామీలిచ్చి మోసం చేశాయని, మరోసారి దొంగ మాటలు చెప్పకుండా కర్రుకాల్చి వాతపెట్టాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్తో కలిసి బుధవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు, హామీలను గుర్తు చేస్తూ.. ఐదు నెలల గడిచినా ఎందుకు అమలు చేయలేదన్నారు. వారి చెప్పిన ఒక్క పథకమైనా వచ్చిందా అంటూ ప్రజలను ప్రశ్నించారు. రైతుబంధు పథకం మంత్రి తుమ్మల నాగేశ్వరావుకే రాలేదని, ఇక రైతులకేమిస్తారని ఎద్దేవా చేశారు. పేద, ముసలి, ముతక, యువతతో పాటు అన్ని వర్గాల వారిని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. పదేండ్ల క్రితం ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన కేసీఆర్.. తాను ముందే చెప్పినట్లు..
రాష్ట్ర అభివృద్ధితోపాటు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు. అప్పుడే ప్రధానిగా గద్దెనెక్కిన మోదీ.. దేశానికి, ప్రజలకు ఏమీ చేయలేదని, కేవలం అదానీ, అంబానీలకే సంపదనంతా పంచిపెట్టారని అన్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలను ఏర్పాటు చేస్తామంటున్నారని, అలా చేస్తే కామారెడ్డి జిల్లా ప్రజలు ఇకనుంచి జహీరాబాద్కు పోవాల్సి వస్తుందన్నారు. బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్, కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్కి కొత్త ముఖాలు కావని, వారు గత 15 ఏండ్లలో ఒక్క మంచి పని కూడా చేయలేదని గుర్తుచేశారు. కామారెడ్డిని ఎంతో అభివృద్ధి చేసిన గంప గోవర్ధన్ను చూసి.. బీసీ బిడ్డ గాలి అనిల్కుమార్ను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్కుమార్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.
అసెంబీ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పోయిందని, అందుకే రేవంత్రెడ్డి ప్రజలను నమ్మించేందుకు దేవుళ్లపై ఒట్లు వేస్తున్నాడని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను పదేండ్లలో ఎలా అభివృద్ధి చేసుకున్నామో ఆలోచన చేయాలన్నారు. పంద్రాగస్టు వరకు రైతు రుణమాఫీ చేస్తామని మరో కొత్త నాటకం ఆడుతున్నారని, సిగ్గులేకుండా ఒట్లు కూడా వేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎలక్షన్ కాగానే రుణమాఫీని పక్కన పడేయవచ్చని కాంగ్రెస్ నాయకులు ఆలోచిస్తున్నారని అన్నారు. వారి మాటలను అసలే నమ్మొద్దన్నారు.