BJP | చండీగఢ్, మే 17: హర్యానాలో లోక్సభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గత రెండు లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు బీజేపీకి జై కొట్టారు. 2014లో రాష్ట్రంలోని 10 స్థానాల్లో బీజేపీ ఏడు గెలుచుకోగా, ఇండియన్ నేషనల్ లోక్దళ్(ఐఎన్ఎల్డీ) రెండు స్థానాలను, కాంగ్రెస్ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. 2019 ఎన్నికల్లో మాత్రం బీజేపీ 58 శాతం ఓట్లతో 10కి 10 స్థానాలను కైవసం చేసుకొని క్లీన్స్వీప్ చేసింది. అయితే, ఆ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు వేగంగా మారాయి.
ఆరు నెలలకే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్లు 58 నుంచి 36 శాతానికి పడిపోయాయి. దీంతో ఈ లోక్సభ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మరోవైపు పదేండ్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న ప్రజా వ్యతిరేకతను సద్వినియోగం చేసుకొని రాష్ట్రంలో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ – ఆమ్ ఆద్మీ పార్టీ కూటమి ప్రయత్నిస్తున్నది.
బీజేపీపై రైతన్నల ఆగ్రహం
2019 లోక్సభ ఎన్నికల్లో హర్యానాలోని మొత్తం 10 సీట్లను బీజేపీ గెలుచుకోవడం ఒక ఎత్తయితే, ఒక్క రోహ్తక్ మినహా మిగతా తొమ్మిది స్థానాలను లక్షల మెజారిటీలతో ఆ పార్టీ కైవసం చేసుకోవడం మరో ఎత్తు. అయితే, ఆ వెంటనే పరిణామాలు మారిపోయాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం, వారిపై కేంద్రం కఠినంగా వ్యవహరించడం, ఇప్పటికీ రైతుల డిమాండ్లను నెరవేర్చకపోవడం వంటి కారణాలతో బీజేపీపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు. హర్యానాలో రైతులు ఎక్కువగా జాట్ సామాజకవర్గానికి చెందిన వారే.
రాష్ట్రంలో వీరి జనాభా 26 శాతం వరకు ఉంది. ఐదు లోక్సభ నియోజకవర్గాల్లో జాట్లే గెలుపోటములను నిర్ణయిస్తారు. ఇక, బీజేపీలో తమకు రాజకీయ ప్రాధాన్యం తగ్గిందనే భావన కూడా జాట్లలో ఉంది. జాట్ల వ్యతిరేకతను గుర్తించిన బీజేపీ.. కోల్పోయే ఓట్లను ఓబీసీలతో భర్తీ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలోనే మనోహర్లాల్ ఖట్టర్ స్థానంలో నాయబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిని చేసింది. అయితే, ఈ మార్పు ఓబీసీలను ఎంతవరకు ప్రభావితం చేస్తుందనేది చూడాల్సి ఉంది.
రెజ్లర్ల ఆందోళన.. అగ్నిపథ్పై వ్యతిరేకత
రాష్ట్రంలో బీజేపీకి మరికొన్ని అంశాలు కూడా ప్రతికూలంగా మారాయి. ముఖ్యంగా బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో రెజ్లర్లు ఆందోళనకు దిగడం, వారి పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరి, బ్రిజ్భూషణ్ కుమారుడికి టికెట్ ఇవ్వడం వంటి అంశాలు కూడా హర్యానా ప్రజల్లో బీజేపీ పట్ల అసంతృప్తికి ఒక కారణం. ఆందోళనకు దిగిన రెజ్లర్లు ఎక్కువగా హర్యానాకు చెందినవారే.
ఇక, హర్యానా యువత ఎక్కువగా సైనిక బలగాల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం పట్ల యువతలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇది కూడా రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. వీటికి తోడు పదేండ్లుగా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. ఇక, కాంగ్రెస్ నుంచి కొత్తగా చేరిన అశోక్ తన్వర్, నవీన్ జిందాల్కు టికెట్లు ఇవ్వడం పట్ల కొందరు బీజేపీ నేతల్లో అసంతృప్తి ఉంది. ఈ అన్ని అంశాలు లోక్సభ ఎన్నికలు బీజేపీ విజయావకాశాలను తగ్గించవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్కు కలిసొస్తున్న అవకాశాలు
బీజేపీకి ఉన్న ప్రతికూల అంశాలను సద్వినియోగం చేసుకొని హర్యానాలో పూర్వవైభవం సాధించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. జాట్లు, రైతులు, యువతను ఆకర్షించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. ఆమ్ ఆద్మీతో పొత్తు కూడా కాంగ్రెస్కు కలిసొచ్చే అవకాశం ఉంది. హర్యానాకు ఇరువైపులా ఉన్న పంజాబ్, ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉండటంతో హర్యానాలోనూ ఆ పార్టీ ప్రభావం ఉంది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో, ఆప్ ఒక స్థానంలో పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్కు ఇక్కడ భూపిందర్ సింగ్ హూడా, కుమారి శెల్జా, రణ్దీప్ సింగ్ సూర్జేవాలా వంటి కీలక నాయకులు ఉన్నారు. అయితే, హూడా నేతృత్వంలో ఒక వర్గం, సుర్జేవాలా, శెల్జా, కిరణ్ చౌదరితో కూడిన ‘ఎస్సార్కే వర్గం’ మధ్య విభేదాలు పార్టీకి మైనస్గా మారాయి. ఇక, జాట్ల ఓట్లు ఏకపక్షంగా కాంగ్రెస్ వైపు పడితే ఆ పార్టీ గణనీయ ఫలితాలను సాధించే అవకాశం ఉంది.
ఐఎన్ఎల్డీ, జేజేపీ ప్రభావమెంత ?
అభయ్ సింగ్ చౌతాలా నాయకత్వంలోని ఐఎన్ఎల్డీ, దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జన్నాయక్ జనతా పార్టీ(జేజేపీ)లు ఈ ఎన్నికల్లో విడిగా పోటీ చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలకు రైతులు, జాట్లలో పట్టుంది. దుష్యంత్ చౌతాలాకు యువతలోనూ ఆదరణ ఉంది. దీంతో ఈ రెండు పార్టీలు సాధించే ఓట్లు బీజేపీని దెబ్బతీస్తాయా? కాంగ్రెస్ విజయావకాశాలను నీరుగారుస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది. ఆ పార్టీలు జాట్ల ఓట్లను చీలిస్తే బీజేపీకి లాభం జరగొచ్చనే విశ్లేషణలు ఉన్నాయి. అయితే, కుటుంబ కలహాలతో ఐఎన్ఎల్డీ, ఎమ్మెల్యేల ఫిరాయింపులతో జేజేపీ బలహీనపడ్డాయి. ఈ పార్టీలు ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపిస్తాయనేది చూడాల్సి ఉంది. మొత్తంగా బీజేపీకి ఈసారి ఇండియా కూటమి నుంచి గట్టి పోటీనే ఎదురవుతున్నది. ముఖ్యంగా, రోహ్తక్, సోనేపట్, సిర్సా, హిసార్, కర్నాల్ స్థానాల్లో బీజేపీ – కాంగ్రెస్ మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.