GST | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 17 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ కార్యాలయాలు అంటే సామాన్యులు జంకుతున్నారు. ఏదైనా పనికోసం దరఖాస్తు చేస్తే రోజులు..నెలల తరబడి పెండింగ్లో పెట్టి చివరకు కొర్రిలు పెట్టి ఈ పనికాదని ఖరాకండిగా చెబుతున్నారు. ఇది సాధారణంగా ప్రభుత్వ అధికారులు తీరు ఇలాగా ఉంటుంది..కానీ కొందరు మాత్రం దరఖాస్తుదారుల నుంచి ఆమ్యామ్యాలు స్వీకరించి ఎంతటి పనినైనా క్షణాల్లో చేసిపెడుతున్నారు. ఇది ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగేతంతు కానీ, జీఎస్టీ కార్యాలయాల్లో కూడా ఇదే సీన్ రిపీటైంది. అక్రమ పద్దతిలో జీఎస్టీ రిఫండ్ను కొట్టేయాలనే ఉద్దేశంతో వ్యాపారి ఆడిన నాటకం బట్టబయలు అయింది. జీఎస్టీ రిఫండ్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్న నిమిషంలోనే బ్యాంక్ ఖాతాలో రూ.2 కోట్లు డిపాజిట్ కాగా, మరో పది నిమిషాల్లో మరో రూ.3 కోట్లు జమయ్యాయి. జీఎస్టీ రిఫండ్కు సంబంధించిన కుంభకోణం బయటకు తేవడంలో ఈ లావాదేవీలే కీలకంగా మారాయి.
విద్యుత్తో నడిచే ద్విచక్ర వాహనాలపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలను ఆసరాగా చేసుకొని ఢిల్లీకి చెందిన ట్యాక్స్ కన్సల్టెంట్ చిరాగ్ శర్మను అడ్డంగా పెట్టుకొని అటు వ్యాపారులు, ఇటు జీఎస్టీ ఉన్నతాధికారులు కోట్ల రూపాయల రిఫండ్ కుంభకోణానికి పాల్పడ్డారు. మెడికల్ వ్యాపారం నిర్వహిస్తున్న రమేశ్ రెడ్డికి సంబంధించిన ఈ-బైక్ల తయారీ సంస్థకు రావాల్సిన రూ.5 కోట్ల జీఎస్టీ రిఫండ్ నిలిచిపోయింది. ఈ రిఫండ్ కోసం రంగంలోకి దిగిన చిరాగ్ శర్మ..జీఎస్టీ ఉన్నతాధికారులకు లంచాలు ఇచ్చి వెంటనే విడుదల చేయించారు. ఇక్కడే అధికారులకు, చిరాగ్ శర్మకు మధ్య మనీ బంధం ఏర్పడింది. ఇటీవల అరస్టైన అధికారులతో చేతులు కలిపిన చిరాగ్ శర్మ.. జీఎస్టీ రిఫండ్తోపాటు కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్, జీఎస్టీ నంబర్లు, ఫైలింగ్ చేయిస్తూ తమ అక్రమ దందాను కొనసాగించారు. ఈ క్రమంలో తమ అక్రమ దందాకు అడ్డువచ్చిన అధికారులను సైతం బెదిరించడానికి సైతం వెనుకాడలేదు. హైదరాబాద్లో రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న నకిలీ ఈ-బైకుల తయారీదారుడికి మాత్రం రిఫండ్కు సంబంధించిన దాంట్లో ఎదురుదెబ్బ తగిలింది. దీనిపై రంగంలోకి దిగిన చిరాగ్ శర్మ రంగంలోకి జీఎస్టీ ఉన్నతాధికారితో మాట్లాడిన పని కాలేదు.ఈ ఫైల్ను వెంటనే తనకు నమ్మిన అధికారి విధులు నిర్వహిస్తున్న నల్గొండకు బదిలీ చేయించుకున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే తిరిగి ఆ ఫైల్స్ హైదరాబాద్కు బదిలీ కావడంతో అనుమానం వచ్చిన జీఎస్టీ అధికారి ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు.