హైదరాబాద్ : ప్రైవేటు స్కూళ్లల్లో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వం అందించే రూ.2 వేల ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమం మంగళవారం ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారితో ప్రైవేటు పాఠశాలలు మూతపడి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న టీచర్లు, సిబ్బందికి సీఎం కేసీఆర్ అండగా నిలిచి, రూ.2వేలు, కుటుంబానికి 25 కిలోల బియ్యం అందించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం నుంచి ఈ నెల 24 వ తేదీవరకు లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. 33 జిల్లాల పరిధిలో మొత్తం 1, 24,704 మంది లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు.
వీరిలో 1,12, 048 మంది టీచర్లు ఉండగా, 12,636 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. ఆదివారం వరకు 1,18,004 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, సోమవారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర జిల్లాల నుంచి మరికొంత మందిని ఎంపికచేశారు. దీంతో లబ్ధిదారుల సంఖ్య 1,24,704కు చేరినట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన వారికి నేటి నుంచి రూ. 2వేల నగదు సాయం అకౌంట్లలో జమ చేయనుండగా.. బుధవారం నుంచి 25 కేజీల బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ నగదు సాయం కోసం ఇప్పటికే విద్యాశాఖ రూ.32 కోట్లు మంజూరుచేయగా, పౌరసరఫరాలశాఖ 3.625 టన్నుల సన్న బియ్యం అందుబాటులో ఉంచింది.