న్యూఢిల్లీ : భారత్లో మూడో విడుత క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ మల్టీనేషనల్ ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ దరఖాస్తు చేసినట్లు డీసీజీఐ వర్గాలు తెలిపాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునైటెడ్ స్టేట్స్, యూరప్, బ్రిటన్, జపాన్లోని రెగ్యులేటర్ల ఆమోదం పొందిన విదేశీ టీకాలకు ఆమోదాన్ని వేగవంతం చేయాలని కేంద్రం గతవారం నిర్ణయించిన విషయం తెలిసిందే. జేఅండ్జే కంపెనీ సుగమ్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా గ్లోబల్ క్లినికల్ ట్రయల్స్ విభాగంలో ఈ నెల 12న దరఖాస్తు చేసింది.
సాంకేతిక కారణాలతో మళ్లీ జాన్సన్ అండ్ జాన్సన్ సోమవారం మళ్లీ తిరిగి దరఖాస్తు చేసిందని డీసీజీఐ వర్గాలు పేర్కొన్నాయి. జేఅండ్జే వ్యాక్సిన్ను 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో మూడు నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఇది సింగిల్ డోస్ టీకా. అయితే, ఇప్పటి వరకు దేశంలో మూడు వ్యాక్సిన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇవన్నీ రెండు మోతాదుల వ్యాక్సిన్లే. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ‘కొవిషీల్డ్’, భారత్ బయోటెక్ ‘కొవాగ్జిన్’, స్పుత్నిక్-వీ వ్యాక్సిన్లకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది.
కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు అత్యవసర వినియోగం కింద ఇప్పటికే వినియోగిస్తుండగా.. త్వరలోనే స్పుత్నిక్ వీ టీకాలు సైతం అందుబాటులోకి రానున్నాయి. ఇదిలా ఉండగా.. దేశంలో భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ మే ఒకటి నుంచి టీకాలు వేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అలాగే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు హాస్పిటళ్లు టీకా తయారీ సంస్థల నుంచి నేరుగా సేకరించేందుకు అనుమతులు సైతం జారీ చేసింది.