వాషింగ్టన్ : భారత్లో కరోనా కేసులు పెరుగుదల నేపథ్యంలో అమెరికా పౌరులకు సెంటర్స్ ఫర్డ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) కీలక సూచనలు చేసింది. భారత్లో అన్ని రకాల ప్రయాణాలకు దూరంగా ఉండాలని చెప్పింది. వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికులకు సైతం కొత్త వేరియంట్లు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే ప్రయాణానికి ముందు వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపింది. కరోనా మహమ్మారి నుంచి ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉన్నందున ప్రపంచవ్యాప్తంగా సుమారు 80శాతం దేశాలకు ‘డునాట్ ట్రావెల్’ మార్గదర్శకాలు పెంచనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ సోమవారం తెలిపింది. కొవిడ్-19 పరిమితుల కారణంగా చాలా మంది అమెరికన్లను ఇప్పటికే యూరప్లో ప్రయాణించకుండా నిరోధించింది. ఇటీవల యూరప్, చైనా, బ్రెజిల్, ఇరాన్, దక్షిణాఫ్రికాలో తన పౌరులు ప్రయాణించకుండా అమెరికా చర్యలు చేపట్టింది.
ఇదిలా ఉండగా.. కరోనా కేసుల భారీగా పెరగడంతో ఇప్పటికే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. అలాగే ఆ దేశం సోమవారం ట్రావెల్ రెడ్ లిస్ట్ దేశాల జాబితాలో భారత్ను చేర్చడంతో పాటు కఠిన ఆంక్షలు విధించింది. బ్రిటన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాట్ హాన్కాక్ మాట్లాడుతూ యూకే, ఐరిస్ దేశీయులు తప్ప భారత్ నుంచి ప్రయాణికులపై నిషేధం విధించినట్లు చెప్పారు. బ్రిటన్ జాతీయులు, విదేశీయులు రెడ్ లిస్ట్ దేశాల నుంచి తిరిగి వస్తే ప్రభుత్వం అనుమతించిన క్వారంటైన్ హోటల్స్లో సొంత ఖర్చులతో పది రోజులు ఐసోలేషన్లో ఉండాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సోమవారం దేశంలో రికార్డు స్థాయిలో 2.73లక్షల కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. మహమ్మారి ప్రారంభమైన తర్వాత రోజువారీ అత్యధిక కేసులు రావడం ఇదే తొలిసారి. దేశంలో కరోనా కేసులు 1.50 కోట్లకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసుల్లో అమెరికా తర్వాత రెండోస్థానంలో భారత్ ఉన్నది.