ముంబై : మహమ్మారి సమయంలో బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మైకోసిస్ ) వెంటాడుతోంది. కొవిడ్ నుంచి కోలుకున్నవారిలో ఈ బ్లాక్ ఫంగస్ కనిపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జనం ఫంగస్ బారినపడ్డారు. అరుదుగా వచ్చే ఈ ఫంగస్ కొవిడ్ పరిస్థితుల్లో మరింత ప్రమాదకరంగా మారుతోంది. మహారాష్ట్రలో అత్యధికంగా రెండువేలపైగా రికార్డయ్యాయి. ఇప్పటికే పలువురు కంటి చూపును కోల్పోగా.. పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ నివారణకు యాంఫోటెరిసిన్ బీ ఇంజెక్షన్ కీలక పాత్ర పోషించనుంది.
ఇంజెక్షన్ తయారీ నిమిత్తం జెనెటిక్ లైఫ్ సైన్సెస్కు అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇచ్చింది. ఎఫ్డీఏ అనుమతి కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. రాబోయే వారం రోజుల్లో వార్ధాలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. సాధారణంగా ఇంజక్షన్ ధర రూ.7వేలు కాగా.. దీనితో పాటు దేశీయంగా తీవ్ర కొరత నెలకొంది. జెనెటిక్ లైఫ్సైన్సెస్ సంస్థ రూ.1200కే అందించనుంది. వార్ధా ప్లాంట్లో కంపెనీ రోజుకు 20వేల ఇంజెక్షన్లు తయారు చేయనుంది. ఈ సంస్థ కరోనా చికిత్సలో వాడుతున్న రెమ్డెసివిర్ వయల్స్ను తయారు చేస్తోంది.