హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పోలీసు కొలువుల కోసం సిద్ధపడుతున్న నిరుద్యోగులు ఈనెల 19 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో పోలీస్, ఎస్పీఎఫ్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో మొత్తం 7,437 పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు తేదీలను అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 19 ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.tgprb.in ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. నియామక ప్రక్రియ కోసం అభ్యర్థులు ప్రాసెస్ మొత్తానికి కలిపి ఒకేసారి వన్-టైమ్ ఫీజు చెల్లించాలని తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పార్ట్-1 నింపే ముందే తమ మొబైల్లో ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని స్పష్టం చేశారు.
ఫీజుల వివరాలు ఇలా..
ఎస్సై స్థాయి పోస్టులైన.. ఎస్సై సివిల్, ఏఆర్, టీజీఎస్పీ, ఎస్ఏఆర్సీపీఎల్, ఎస్పీఎఫ్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు రూ.750గా నిర్ణయించారు. రిజర్వేషన్ వర్తించని ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది. ఫింగర్ ప్రింట్స్ బ్యూరో ఏఎస్సై పోస్టులకు కూడా ఇదే ఫీజు వర్తిస్తుంది. కానిస్టేబుల్ స్థాయి పోస్టులు.. కానిస్టేబుల్ సివిల్, ఏఆర్, ఎస్ఏఆర్సీపీఎల్, ఎస్పీఎఫ్, ఫైర్ ఫైటర్, జైలు వార్డర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీలకు రూ.600గా ఫీజు నిర్ణయించారు. రిజర్వేషన్ వర్తించని బీసీ, ఓసీ అభ్యర్థులకు రూ.1,200 ఫీజు నిర్ణయించారు. అభ్యర్థి ఒకటి కంటే ఎకువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, దేహదారుఢ్య పరీక్షలు (పీఎంటీ/పీఈటీ) ఒకేసారి నిర్వహిస్తారని చెప్పారు. దీనికి సంబంధించిన వెసులుబాటుగా ఓసీ, బీసీ అభ్యర్థులకు ప్రతి అదనపు క్యాటగిరీ దరఖాస్తుపై రూ.100 ఫీజు తగ్గిస్తామని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.50 తగ్గించనున్నట్టు బోర్డు తెలిపింది.
ఉచితమని చెప్పి.. ఇప్పుడు ఫీజులా?
వన్ టైమ్ ఫీజు కింద ఒకేసారి భారీగా నిరుద్యోగుల నుంచి వసూలు చేస్తుండటంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ప్రభుత్వం తమ దగ్గర బడ్జెట్ లేదని చెప్తూ.. తక్కువ పోస్టులతో నోటిఫికేషన్లు ఇచ్చి, వాటి దరఖాస్తు ఫీజుల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీగా వసూలు చేస్తున్నదని నిరుద్యోగ జేఏసీ నేత ఆకాశ్ విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో ‘అధికారంలోకి వస్తే అప్లికేషన్ ఫీజు లేకుండానే పోస్టులకు దరఖాస్తు చేసుకునే వెలుసుబాటు కల్పిస్తాం’ అని చెప్పారని, నేడు భారీగా ఫీజులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.