సమైక్య పాలనలో దండగలా మారిన వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో పండుగలా మార్చారు సీఎం కేసీఆర్.. దేశానికి వెన్నెముక అయిన అన్నదాతకు రంది లేకుండా 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్.. పుష్కలంగా సాగు నీటి వసతి కల్పించారు. రైతుబంధు, రైతు బీమా కల్పించి రైతుపక్షపాతిగా నిలిచారు. మన రాష్ట్రంలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలుకావాలని కర్షకలోకం ఆకాంక్షిస్తున్నది. జాతీయ రాజకీయాల్లోకి రాకమునుపే రైతులను ముంచే నల్లచట్టాలపై ఢిల్లీ కేంద్రంగా నిరసన తెలిపి దేశవ్యాప్త రైతాంగానికి తోడుగా నిలిచారు. రైతుల గురించి నిరంతరం ఆలోచించే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తేనే దేశ వ్యాప్తంగా ఉన్న అన్నదాతల కష్టాలు దూరమవుతాయని గట్టిగా నమ్ముతున్నారు. రాష్ట్రంలో కర్షకుల బాగు కోసం నిరంతరం కృషి చేస్తున్న కేసీఆర్ దేశరాజకీయాల్లోకి రావాలని ముక్తకంఠంతో కోరుతున్నారు.
నిజాంసాగర్, అక్టోబర్ 2: తొలకరి పలకరింపుతో నాగలి పట్టే రైతన్నకు పెట్టుబడిసాయం అందించి అండగా ఉన్నాడు. ఎప్పుడొస్తుందో.. ఎంతసేపు ఉంటుందో తెలియని విద్యుత్ సరఫరాను 24గంటల పాటు అందిస్తూ కర్షకలోకానికి భరోసానిచ్చాడు. ప్రాజెక్టుల నుంచి కాలువల ద్వారా చెరువులను నింపుతూ ఆయకట్టు మొత్తం పచ్చనిపొలాలతో విలసిల్లేలా చేశాడు. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా తీర్చిన నేతగా పేరొందాడు. ఆకస్మికంగా రైతు మరణిస్తే.. ఆ కుటుంబానికి రూ.5లక్షలు అందజేస్తూ రైతుబీమా రూపంలో అండగా నిలుస్తున్నాడు. పంట చేతికొచ్చిన తర్వాత దళారులపాలు కాకుండా ప్రభుత్వం ద్వారానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరను అందిస్తున్నారు. ఇలా ప్రతిచోటా రైతుకు వెన్నంటే ఉంటూ ఆత్మబంధువుగా నిలిచారు సీఎం కేసీఆర్. జాతీయ రాజకీయాల్లోకి రాకమునుపే రైతులను ముంచే నల్లచట్టాలపై ఢిల్లీ కేంద్రంగా నిరసన తెలిపి దేశవ్యాప్త రైతాంగానికి తోడుగా ఉన్నాడు. అలాంటి కేసీఆర్ ప్రధాని అయితే అన్ని రాష్ర్టాల్లోని రైతాంగానికి మంచిరోజులొస్తాయని కర్షకలోకం అభిప్రాయపడుతున్నది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే మేమంతా కేసీఆర్ వెంటే నడుస్తామని ప్రతినబూనుతున్నది.
దేశమంతా సంక్షేమ పథకాలు
కేసీఆర్ రైతుబంధువుగా మారి రైతులను బాగుచేస్తున్న తీరు యావత్ దేశం చూస్తున్నది. రైతుబంధు, 24 గంటల కరెంటు ఇయ్యాలని అడుగుతున్నది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తేనే ఇది సాధ్యమవుతుంది. తీవ్ర ఇబ్బందులుపడ్డ రైతులకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆత్మగౌరవంతో బతికేలా చేశారు. ఉచిత కరెంటు, సాగు నీరు అన్నింటికన్నా ముఖ్యంగా వడ్ల కొనుగోలు కేంద్రాలతో రైతులను ఆదుకున్నారు.
– గంగారెడ్డి, రైతు, కొమలంచ, నిజాంసాగర్
ప్రధాని అయ్యే అర్హత ఉంది
రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి ప్రధాని అయితే రైతుల కష్టాలు తీరుస్తారు. ఇందుకు అన్ని అర్హతలు కేసీఆర్కే ఉన్నాయి. అనతికాలంలోనే రాష్ట్ర వ్యవసాయరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. వ్యవసాయంతోపాటు అన్ని రంగాల్లో అనుభవం ఉన్న వ్యక్తి కేసీఆర్. అందుకే ఆయన ప్రధానిగా మారితే దేశం దశ దిశ మారుతుంది. దేశంలోని నదుల అనుసంధానం, నిరంతర విద్యుత్, సాగు నీరు అందించే దిశగా కృషి చేస్తారనడంలో సందేహం లేదు.
– సురేశ్, రైతు, గున్కుల్, నిజాంసాగర్
రైతులతోపాటు దేశాభివృద్ధి..
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చి ప్రధానమంత్రి అయితే దేశంలోని రైతులందరూ బాగుపడతారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి మారింది. సమైక్య పాలకుల హయాంలో రైతులు కరెంటు, సాగునీటి కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేసిన రోజులు అనేకం. అలాంటిది సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు, సాగునీటి కష్టాలు కనబడకుండా పోయి.. రైతుల ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. కేసీఆర్ దేశ్ కీ నేతగా మారితేనే బాగుంటుంది.
– బస్వరాజ్, రైతు, మద్నూర్
అన్ని రాష్ర్టాలకూ మేలు..
మోదీ హయాంలో డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడంతో ఎరువుల రేట్లు ఆకాశాన్నంటాయి. బ్యాంకులను లూటీ చేసిన వారి నుంచి కమీషన్లు తీసుకొని లక్షల కోట్లు మాఫీ చేసిన కేంద్ర పాలకులు రైతుల కోసం ఇవ్వడానికి చేతులు రావడం లేదు. మాట ఇచ్చిన విధంగా రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నారు.
– సంగారెడ్డి, రైతు, సీతారాంపల్లి, బిచ్కుంద
కేసీఆర్ సత్తా ఉన్నోడు..
సీఎం కేసీఆర్ సత్తా ఉన్న నాయకుడు. ఎవ్వలకు ఏంగావాల్నో ఆయనకు తెల్సు. రైతుల సంక్షేమం కోసం పాటుపడే నాయకుడు. ఆరుగాలం కష్టపడి పండించే రైతులకు పెద్ద దిక్కు అయిండు. ఇన్నేండ్లు ఏ సర్కారు పట్టించుకున్న పాపాన పోలేదు. కేసీఆర్ వచ్చాకే అన్నదాత కష్టాలు తీరాయి. తెలంగాణలో ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా, రైతు పెట్టుబడి, ఉచిత కరెంట్ దేశంలోని రైతులందరికీ అందిస్తే బాగుపడ్తారు. అందుకే సీఎం కేసీఆర్ దేశ పాలకుడు కావాలె.
– దుర్గారెడ్డి, రైతు, గోర్గల్, నిజాంసాగర్
కష్టాలు తీరుతాయ్..
రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం ఎకరానికి ఐదు వేల చొప్పున పెట్టుబడి అందిస్తుంది. అప్పులు చేసుడు తప్పింది. రైతు మృతి చెందిన అనంతరం ఆ కుటుంబానికి ప్రభుత్వం ఐదు లక్షలు అందించి భరోసా కల్పిస్తున్నది. రైతుబంధు, రైతుబీమా దేశంలోని రైతులందరికీ అందించడం కేసీఆర్కే సాధ్యమవుతుంది. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే రైతులందరి కష్టాలు తీరుతాయి. మన రాష్ట్రంలో ఉన్న పథకాలు దేశమంతా అమలవుతాయి.
– వెంకట్రాంరెడ్డి, రైతు, అన్నారం, పిట్లం
రైతాంగానికి భరోసా..
జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వస్తే రాష్ట్రంలో మాదిరిగా దేశంలోని అన్ని రాష్ర్టాల రైతులకు భరోసా కల్పించినవారవుతారు. ఉచిత విద్యుత్తోపాటు పంట పెట్టుబడి సాయం అందిస్తే వారి బతుకులు బాగుపడ్తాయి. ఇప్పుడున్న ప్రధాని రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నాడు. కేసీఆర్ రైతుల పక్షాన పోరాటం చేస్తున్నారు. దేశం మొత్తం 24గంటల ఉచిత కరెంట్ ఇస్తే ఇతర రాష్ర్టాల రైతుల ఇంట సిరులు కురుస్తాయి.
– దేవేందర్రెడ్డి, రైతు, తిమ్మానగర్, పిట్లం
సమయం ఆసన్నమైంది..
కేసీఆర్కు రైతుల కష్టాలు బాగా తెలుసు. వారి కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా, పంటకు పెట్టుబడి వంటి పథకాలు తీసుకురావడంతో.. నేడు రైతన్నలు సంతోషంగా పంటలను సాగు చేసుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకాలు మన వద్దే అమలవుతున్నాయి. వ్యవసాయం దండగ అన్న నోళ్లను మూయించి.. వ్యవసాయం ఓ పండుగలా మార్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ రావాలి.
– గొల్ల పవన్, రైతు, నర్వ, నిజాంసాగర్