వనపర్తి, మే 5: ‘నువ్వు.. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావన్న విషయాన్ని మరువకు. నీ స్థాయికి తగిన మాటలు మాట్లాడు. ఇంతటి బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన సీఎంను నేను ఇంతవరకూ చూడలేదు. నిన్ను చూస్తే.. ఊసరవెల్లి కూడా సిగ్గుపడ్తది. నీ రాజకీయ జీవితం టీఆర్ఎస్తోనే మొదలైందన్న నిజాన్ని గుర్తుంచుకో’ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఆదివారం నిరంజన్రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం, కేసీఆర్ను తిట్టడమే పరమావధిగా పెట్టుకోవడం తగదని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రెండు సార్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్.. వయస్సులో నీ కంటే 20 ఏండ్లు పెద్ద అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఆయనను తిట్టడం మంచిది కాదని హితవు చెప్పారు. రేవంత్ రాజకీయం నాటి టీఆర్ఎస్ పార్టీలోనే మొదలైందన్న విషయాన్ని మరువొద్దని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నాడు టీడీపీలో ఉన్న సమయంలో కాంగ్రెస్ నాయకురాలిపై ఎంత నీచంగా మాట్లాడావో ప్రజలకు గుర్తుందని, నేడు కాంగ్రెస్లో చేరి అదే సోనియమ్మను దేవత అంటూ, ఆమె రుణం తీర్చుకుంటామని బీరాలు పలుకుతున్న రేవంత్ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని ఎద్దేవా చేశారు.
ఆరు గ్యారెంటీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా గప్పాలు కొట్టడం తగదని హెచ్చరించారు. ఎప్పుడూ మహబూబ్నగర్ బిడ్డను అని చెప్పుకునే నువ్వు.. 90 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డిని పూర్తి చేసి సాగునీరందించాలని సవాల్ విసిరారు. గత ప్రభుత్వం రైతుబంధు ఇచ్చేందుకు రూ.7,500 కోట్లు సిద్ధంగా ఉంచితే.. కాంగ్రెస్ సర్కారు వచ్చిన వెంటనే వాటిని రైతు ఖాతాల్లో జమచేయకుండా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిందని విమర్శించారు. ఈ సమావేశంలో నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల జిల్లా ఇన్చార్జి బైకని శ్రీనివాస్, బీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.