Yellareddy | కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యంపై బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కుడుముల సత్యం ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరాడు. దీంతో పార్టీ ఫిరాయించిన మున్సిపల్ చైర్మన్పై బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ తీర్మాన పత్రాన్ని గత నెల 24వ తేదీన కలెక్టర్కు అందజేశారు.
అయితే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ముగిసిన తర్వాత అవిశ్వాసంపై సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులు తీర్మానించారు. ఈ క్రమంలోనే శనివారం నాడు ఆర్డీవో మన్నె ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మున్సిపల్ సభ్యులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 12 మంది కౌన్సిలర్లు ఉండగా.. వారిలో 11 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికారు. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గిందని ఆర్డీవో ప్రకటించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జూన్ 14 తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.