కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కొవిడ్ నిబంధనల అమలుపై కేంద్ర సీఈసీ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్ శనివారం సమీక్ష నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఆరోగ్యశాఖ కార్యదర్శి, కోల్కతా పోలీస్ కమిషనర్తో మార్గదర్శకాల అమలుపై ఈసీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించినట్లు పోల్ ప్యానెల్ ప్రతినిధి తెలిపారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల ఎన్నికల సంఘం ర్యాలీలు, పాదయాత్రలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.
బహిరంగ సభలకు హాజరయ్యే జనం సంఖ్యను 500కు పరిమితం చేసింది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో కొవిడ్-19 భద్రతా నిబంధనలు అమలు చేయడంలో ఈసీ తీరుపై కోల్కతా హైకోర్టు గురువారం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పశ్చిమ బెంగాల్ ఎనిమిది విడుతలుగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆరు విడుతల పోలింగ్ ముగియగా.. ఈ నెల 26న ఏడో విడుత, 29న ఎనిమిది విడుత పోలింగ్ జరుగనుంది. వచ్చే నెల 2న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇవికూడా చదవండి..