ముంబై : కొత్త వేరియంట్లతో రీ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయి. వాక్సిన్ తీసుకున్నా మహమ్మారి మళ్లీ సోకుతోంది. తాజాగా ఓ 26 ఏళ్ల వైద్యురాలు 13 నెలల్లో మూడుసార్లు కరోనా బారినపడ్డారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు సైతం వైరస్ సోకింది. వ్యాక్సిన్ రెండు మోతాదులు తీసుకున్న తర్వాత వైరస్ బారినపడ్డట్లు బాధిత వైద్యురాలే తెలిపారు. ముంబై నగరంలోని ములుండ్ కొవిడ్ సెంటర్లో పని చేసిన వైద్యురాలు శ్రుతి హలారి మూడుసార్లు వైరస్ బారినపడగా.. అధ్యయనంలో భాగంగా జన్యుశ్రేణి పరిశీలన కోసం నమూనాలను సేకరించారు. వైద్యురాలు శృతి మూడోసారి కరోనా పాజిటివ్కు పరీక్షించే ముందు ఎక్కువగా ఇంట్లోనే ఉండి.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం సిద్ధమవుతోంది.
ముంబైలోని వీర్ సావర్కర్ హాస్పిటల్లో కొవిడ్ డ్యూటీలో ఉన్న సమయంలో గతేడాది జూన్ 17న తొలిసారి కరోనా బారినపడ్డారు. కోలుకున్నాక ఆమె కుటుంబం మొత్తం మార్చి 8న, ఏప్రిల్ 29న కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుంది. ఆ తర్వాత ఈ ఏడాది మే 29న శ్రుతి హలారి రెండోసారి వైరస్కు పాజిటివ్గా పరీక్ష చేశారు. తేలికపాటి లక్షణాలు ఉండడంతో ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకున్నది. ఈ మళ్లీ ఈ నెల 11న వైద్యురాలితో పాటు ఆమె కుటుంబం మొత్తం మహమ్మారి బారినపడడంతో ఆసుపత్రిలో చేరింది. ఈ సందర్భంగా శ్రుతి మాట్లాడుతూ ‘నేను మూడోసారి వైరస్ బారినపడ్డాను. ఈ సారి వైరస్ తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. నా సోదరుడికి, తల్లికి మధుమేహం ఉంది. తండ్రికి రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలున్నాయి. సోదరుడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంది. రెండు రోజులు అతన్ని ఆక్సిజన్పై ఉంచి చికిత్స అందించారు’ అని మీడియాకు తెలిపారు. రక్తంలో కొవిడ్ యాంటీబాడీస్ కోసం చేసిన పరీక్షల్లో సానుకూల ఫలితాలను వచ్చాయని పేర్కొన్నారు.
అయితే, కొవిడ్ టీకా వేయించుకున్నా వైరస్ సోకుతుందని, అయితే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. టీకా రెండు డోసుల తర్వాత వైరస్ బారినపడినవారున్నారు. అన్ని వయస్సులవారికి బ్రేక్ థ్రో ఇన్ఫెక్షన్ (టీకాలు తీసుకున్న తర్వాత వైరస్ సోకడం) వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ‘టీకాలు వ్యాధి తీవ్రతను తగ్గించడంతో పాటు త్వరగా కోలుకునేందుకు సహకరిస్తాయి. ప్రాణాంతకంగా మారే అవకాశం ఉండదు’ అని వాక్హార్డ్ దవాఖానకు చెందిన వైద్యుడు బెహ్రామ్ పార్దివాలా తెలిపారు. ఇటీవల, ఐసీఎంఆర్ అధ్యయనంలో కూడా ఇదే విషయం వెల్లడైన సంగతి తెలిసిందే. అయితే, వైరస్ వైవిధ్యాలు, తక్కువ రోగ నిరోధకశక్తి రీ ఇన్ఫెక్షన్కు కారణాలై ఉండవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.