శ్రీశైలం : ఎగువ నుంచి వరద కొనసాగుతుండడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 4,66,864 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. జలాయశం నుంచి 62,605 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉన్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ఇప్పుడు 879.30 అడుగుల మేర నీరుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను ప్రస్తుతం 184.27 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమగట్లలో ఉన్న జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతున్నది.
గడిచిన నాలుగు రోజుల్లో దాదాపు 90 టీఎంసీల వరకు నీరు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కృష్ణా ప్రాజెక్టులతో పాటు, తుంగభద్ర నుంచి నీటి విడుదల కొనసాగుతుండడంతో మరో మూడు రోజుల పాటు రోజుకు శ్రీశైలానికి నాలుగు లక్షల క్యూసెక్కులకుపైగా వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ప్రాజెక్టు గేట్ల ఎత్తివేయనున్నట్లు ఎస్ఈ చెప్పారు. అయితే, నాలుగైదు రోజుల పాటు గేట్లు తెరిచే ఉంచే అవకాశాలున్నాయి. గేట్లు ఎత్తివేయనున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.