లండన్ : కరోనా మహమ్మారి, కొత్త వేరియంట్ల వ్యాప్తిని అరికట్టేందుకు సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్ సహా రెడ్లిస్ట్లో ఉన్న దేశాలకు వెళ్లే ప్రయాణికులు తిరిగి సౌదీలో ప్రవేశించకుండా మూడేళ్లపాటు నిషేధం విధించనున్నట్లు హెచ్చరించింది. గతేడాది కరోనా మహమ్మారి నుంచి మొదటిసారిగా అధికారుల ముందస్తు అనుమతి లేకుండా మేలో విదేశాలకు అనుమతించిన కొందరు సౌదీ పౌరులు ప్రయాణ నిబంధనలను ఉల్లంఘించారని అంతర్గత మంత్రిత్వశాఖ అధికారి పేర్కొన్నారు.
నిబంధనలు ఉల్లంఘించినట్లు నిరూపితమైతే తిరిగి దేశానికి తిరిగి వచ్చాక భారీ జరిమానాతో పాటు మూడు సంవత్సరాలు దేశంలోకి ప్రవేశించకుండా నిషేధానికి గురవుతారని పేర్కొన్నారు. సౌదీ అరేబియా ‘రెడ్లిస్ట్’లో భారత్, ఆఫ్ఘనిస్తాన్, అర్జెంటీనా, బ్రెజిల్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, లెబనాన్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, టర్కీ, వియత్నాం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా తదితర దేశాలున్నాయి. ఆయా దేశాలకు ప్రయాణాలను సౌదీ నిషేధించింది. 30 మిలియన్ల జనాభా ఉన్న ఈ గల్ఫ్ దేశంలో మంగళవారం కొత్తగా 1,379 కొత్త కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5,20,774కు పెరగ్గా.. మృతుల సంఖ్య 8,819కు పెరిగింది.