రామగిరి, జూలై 23 : కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూల, కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను మరింత వేగంగా అమలు చేస్తున్నదని, ఎందరో పోరాట యోధుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న దేశ స్వాతంత్ర్యాన్ని విదేశీ, స్వదేశి కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెడుతున్నారని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. నాడు బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం సాగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ పెట్టుబడిదారులకు, మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా నేడు కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు, ప్రజాతంత్రవాదులు క్విట్ ఇండియా స్ఫూర్తితో భారతదేశ ఆర్థిక, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని, జాతీయ పిలుపులో భాగంగా ఆగస్టు 10న రాష్ట్ర వ్యాప్తంగా “జైల్ భరో” విజయవంతానికై సిఐటియు-రైతు-వ్యవసాయ కార్మిక సంఘాలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
గురువారం సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎం వి ఎన్ విజ్ఞాన కేంద్రంలో జరిగిన జిల్లా సదస్సులో పాల్గొని మాట్లాడారు. బిజెపి ప్రభుత్వం నయా ఉదారవాద సంస్కరణలను దుందుడుకుగా అమలు చేస్తున్నది. అందులో భాగంగానే లేబర్ కోడ్ల అమలుకు ఫైనల్ రూల్స్ను నోటిఫై చేసింది. విద్యుత్ సవరణ బిల్లు-2025, విత్తన చట్టానికి సవరణలు ప్రతిపాదించారు. సులభతర వ్యాపారం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) పేరుతో పెట్టుబడిదారుల గరిష్ట లాభాల కోసం కార్మిక చట్టాలను రద్దు చేసింది. రోజువారి పని దినాన్ని 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచుకునేందుకు యాజమాన్యాలకు పూర్తి స్వేచ్చనిచ్చింది. సమ్మె హక్కును కాలరాస్తూ ఆంక్షలు విధించారు. కార్మిక సంఘాల గుర్తింపు, రిజిస్ట్రేషన్ ను కష్టతరం చేశారు. ఉద్యోగ భద్రతను పాతర వేశారు. 300 మంది లోపు పనిచేసే కంపెనీలో కార్మికులను ఎప్పుడైనా నోటీసు లేకుండా తొలగించేందుకు “హైర్ & ఫైర్” విధానాన్ని తెచ్చారు. వేతనాల కోడ్ల కనీస వేతనాలు నిర్ణయించే మౌలిక విధానానికి మంగళం పాడారు. లేబర్ కోడ్స్ అమలైతే తరతరాలుగా పోరాడి సాధించుకున్న హక్కులు, కార్మికవర్గం కోల్పోతారు. 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకునే వరకు పోరాడాలని సదస్సు నిర్ణయించింది.
అమెరికా, బ్రిటన్, న్యూజిల్యాండ్తో కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నది. భారత వ్యవసాయ రంగంలోకి 32 దేశాల నుండి దిగుమతులను ప్రోత్సహించారు. జీరో సుంకంతో దిగుమతులు రావడంతో దేశీయ వ్యవసాయోత్పత్తుల ధరలు తగ్గిపోయి రైతులు దివాళా తీస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నీట్ పేపర్ లీకేజీ నిరసిస్తూ నల్లగొండ పట్టణంలోని సుభాష్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు చిన్నపాక లక్ష్మీనారాయణ, డబ్బికార్ మల్లేష్, కందాల ప్రమీల, బండ శ్రీశైలం, దండంపల్లి సత్తయ్య, బొజ్జ చినవెంకలు, గండమల రాములు, దండంపల్లి సరోజ, అవుట రవీందర్, మల్లు గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు.