న్యూఢిల్లీ : త్వరలో భారత్లో పిల్లలకు సంబంధించిన మరో కొవిడ్ టీకా ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. 2-17 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలపై రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన కోవోవాక్స్ టీకాకు షరతులతో అనుమతి ఇవ్వాలని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) మంగళవారం సిఫారసు చేసింది. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ఈఓ) సీరం కంపెనీ సమర్పించిన సవరించిన స్టడీ ప్రోటోకాల్ దరఖాస్తుపై చర్చించింది. ఈ మేరకు కోవోవాక్స్ టీకా ఫేజ్-2, 3 ట్రయల్స్ నిర్వహించేందుకు కంపెనీకి అనుమతి ఇవ్వాలని సిఫారసు చేసింది.
సీరం కంపెనీ 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న భారతీయ వయోజనుల్లో టీకా భద్రత, ఇమ్యూనోజెనిసిటీని నిర్ధారించేందుకు.. పీడియాట్రిక్ కోహార్ట్ను చేర్చేందుకు సవరించిన ప్రోటోకాల్స్ను సమర్పించింది. సీరం కంపెనీ నోవావాక్స్ ఇంక్ అభివృద్ధి చేసిన టీకాను కోవోవాక్స్ పేరిట భారత్లో ఉత్పత్తి చేయనుంది. టీకా ట్రయల్స్ ప్రస్తుతం అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, యూకేలో 50వేల మందికిపైగా వయోజనులు, 2,248 మంది పిల్లలపై ట్రయల్స్లో నిర్వహించగా.. వ్యాక్సిన్పై భద్రత, సమర్థత బలంగా ఉందని ఇమ్యునోజెనిసిటీ డేటా సమర్పించినట్లు తెలిసింది.
భారత్లో కొనసాగుతున్న ఫేజ్- 2, 3 ట్రయల్స్లో 1400 మందికిపైగా మొదటి డోసు వేయగా.. ఇప్పటి వరకు ఎలాంటి భద్రతా పరమైన సమస్యలు లేవని దరఖాస్తులో కంపెనీ పేర్కొంది. కాగా, రాబోయే నెలల్లో కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉందని, పిల్లలపై ప్రభావం చూపుతుందనే ఊహాగానాలున్నాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతమైతే.. పిల్లలకు టీకాలు వేసేందుకు మార్గం సుగమం కానుంది.