హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు మైకాసురులు, భూ బకాసురులుగా మారి చెరువులు, జలాశయాలను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మెదక్ జిల్లాకు గుండెకాయ లాంటి సింగూరు జలాశయం కాంగ్రెస్ నాయకుల అక్రమ సంపాదనకు అడ్డాగా మారిందని ఆరోపించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బావమరిది అనిల్రెడ్డి సింగూరు జలాశయం పరిధిలోనే భూ కబ్జాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జలాశయం సమీపంలో అనిల్రెడ్డికి ఉన్న ఫామ్హౌస్ పకనే నిజాం కాలం నాటి కుంటలను సైతం లెవల్ చేసి ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు.
చేపల చెరువులను తొలగించిన అధికారులు ఈ ఆక్రమణలను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. కబ్జాలతో సింగూరు డ్యామ్కు ప్రమాదం పొంచి ఉన్నందున నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అధికారులు జోక్యంచేసుకొని అనిల్రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణభవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింగూరు జలాశయం కబ్జా కోణాన్ని ఆధారాలు సహా బయటపెట్టారు. సింగూరు జలాశయ కబ్జా వీడియో సాక్ష్యాధారాలను జిల్లా కలెక్టర్కు స్వయంగా అందజేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎకరం మాత్రమే కబ్జాకు గురైందని అధికారులు సాకులు చెప్తూ మంత్రి ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారని విమర్శించారు.
సింగూరు కబ్జా, ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియాలో వాస్తవాలు బయటపెడుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై మంత్రి దామోదర పగబట్టారని క్రాంతికిరణ్ ఆరోపించారు. మంత్రి నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక బుధవారం దవాఖానకు వెళ్లిన బీఆర్ఎస్ కార్యకర్త అశోక్ను మఫ్టీలో ఉన్న పోలీసులు ఎత్తుకెళ్లారని, జహీరాబాద్ పోలీస్స్టేషన్కు తరలించి చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. పోలీసులు తమ థర్డ్ డిగ్రీ చర్యలను మంత్రికి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా చూపించి పైశాచిక ఆనందం పొందారని మండిపడ్డారు. తాము ఆరు గంటలపాటు పోలీస్స్టేషన్ ఎదుట ధర్నాచేస్తే గానీ అశోక్ను విడిచిపెట్టలేదని పేర్కొన్నారు. మంత్రి చెప్పినట్టు వింటూ బీఆర్ఎస్ శ్రేణులను వేధిస్తున్న పోలీస్ అధికారులు పద్ధతి మార్చుకోవాలని, చట్ట ప్రకారం నడుచుకోకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.