న్యూఢిల్లీ : కొవిడ్ టీకా బూస్టర్ డోస్పై లోతైన పరిశీలన చేస్తున్నట్లు నీతి ఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. జాతీయ నిపుణుల బృందం కొవిడ్ టీకా బూస్టర్ డోస్ ఇవ్వడాన్ని పరిగణలోకి తీసుకుందని చెప్పారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడిన సమయంలో బూస్టర్ డోస్ ఆవశ్యకతపై అడిగిన ఓ ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. కరోనా టీకాపై నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ చివరి సమావేశంలో బూస్టర్ డోస్ సమస్యపై చర్చించిందని చెప్పారు. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ బూస్టర్ డోస్ను నిషేధించాలని పిలుపునిచ్చిందని, ఇక ఇది ఎలా ముందుకు సాగుతుందో చూడాలన్నారు.
అయితే, కరోనా నుంచి పూర్తి రక్షణ కోసం ప్రజలు తమ రెండు మోతాల వ్యాక్సిన్ను సకాలంలో తీసుకోవాలని స్పష్టం చేశారు. వైరస్ బారినపడ్డ, క్యాన్సర్కు చికిత్స పొందుతున్న వ్యక్తులు ప్రత్యేకించి టీకాలు వేసినట్లు నిర్ధారించుకోవాలన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మాట్లాడుతూ టీకాలు వేసినా.. జాగ్రత్తలు పాటించడం అవసరమన్నారు. ఇప్పటి వరకు దేశంలో 52 కోట్ల టీకా మోతాదులు పంపిణీ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో 18-44 సంవత్సరాల మధ్య 18,20,95,467 డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది.