Chandrashekhar Patil | బాల్యంలో బొమ్మలతో మొదలైన స్నేహం యవ్వనంలో ప్రేమగా మారింది. ఆపై అభిరుచిగా ఎదిగింది. ఇప్పుడు, వడోదరా(గుజరాత్)లోని చంద్రశేఖర్ పాటిల్ ఇంట్లో వేలాది బొమ్మలున్నాయి! తొలి నాగరికతనాటి బొమ్మల నుంచి కంప్యూటర్ యుగంలో చిప్ సాయంతో ఆడిపాడే డ్యాన్సింగ్ డాల్స్ దాకా.. ఆ జాబితా పెద్దదే. అవన్నీ ప్రదర్శించాలంటే ఓ మ్యూజియం కావాలి! ఆ ప్రయత్నంలోనే ఉన్నారు పాటిల్ సాబ్.
అప్పటికి చంద్రశేఖర్ పాటిల్కు ఐదారేండ్లు. ఆడుకోవడానికి అమ్మానాన్న బొమ్మలు కొనిచ్చారు. బంధువులూ కొన్ని కొనిచ్చారు. బాగా నచ్చాయి. ఇష్టంగా ఆడుకున్నాడు. మిగతా పిల్లల్లా పాడు చేయలేదు. కొత్త బొమ్మలు వచ్చిన ప్రతిసారీ పాత బొమ్మల్ని భద్రంగా దాచుకున్నాడు. ఇప్పుడాయన వయసు నలభై ఏడు. పాటిల్ దగ్గరున్న బొమ్మల సంఖ్య పద్నాలుగువేల పైమాటే. ‘అన్ని బొమ్మలా?’ అని ఆశ్చర్యపోకండి. ఎంత కష్టపడి కొన్నాడో?’ అని అడగకండి. అడిగితే మాత్రం.. అదో బొమ్మల కథే!. ‘చారిత్రక తొలి యుగంలో వెండి, రాగితో బొమ్మలు చేశారు. వాటిని సామాన్యులు కొనలేరు కాబట్టి.. పేదల కోసం మట్టి, ఇనుముతో చేసిన బొమ్మలు వచ్చాయి. అలా మొదలైన బొమ్మల పరిశ్రమ కాలంతోపాటు మారుతూ వచ్చింది. జంతువులు, పక్షులు, ఎద్దులబండి, కార్లు, బస్సులు, బైక్లు.. ఇలా కొత్తకొత్త బొమ్మలు వచ్చి చేరాయి. గజతురగ బలాలు సైతం వచ్చి చేరాయి. మనిషి ఆవిష్కరణలన్నీ బొమ్మల రూపం సంతరించుకున్నాయి. మట్టి, రాగి, దంతం, ఇనుము, వెండి, ప్లాస్టిక్, పార్సెలిన్, కొయ్యతో చేసిన అన్ని రకాల బొమ్మలూ నా దగ్గర ఉన్నాయి. కొన్నిటిని ఇ-వేలంలో కొన్నాను’ అని వివరిస్తారు పాటిల్ .
హరప్పా నాగరికత సమయంలో మూపురం ఉన్న ఎద్దు, ఒంటికొమ్ము జంతువు బొమ్మలు ఎక్కువగా ఉపయోగించినట్టు ఆధారాలు ఉన్నాయి. మట్టితో, కొయ్యతో చేసిన బొమ్మలు అటూ ఇటూ కదిలేవి కూడా. మౌర్యుల హయాంలో దంతపు బొమ్మలు ఇంట్లో ఉండటం ఓ స్టేటస్ సింబల్. స్వర్ణయుగంగా పేరుపొందిన గుప్తుల కాలంలో బొమ్మలకు విపరీతమైన ఆదరణ ఉండేదట. మానవ ముఖాకృతులు, జంతువుల బొమ్మలను ఎక్కువగా తయారు చేసేవారు. మొగలుల కాలంలో వస్ర్తాలతో తయారుచేసిన బొమ్మలను కులీనులు ఆదరించేవారు. గుర్రాలు, ఏనుగులు, ఆయుధాలు ధరించిన సైనికుల బట్ట బొమ్మలను ఇంట్లో అలంకరించుకునేవారు. మొగల్ చక్రవర్తుల యుద్ధ చరిత్రను ఈ బొమ్మలు మనకు చెబుతాయి. మరాఠాల హయాంలో జీవితమే ఓ వేడుక. దీంతో నాణ్యమైన బొమ్మలకు ప్రాధాన్యం పెరిగింది. చెక్క, లోహాలతో చేసిన దేవతామూర్తులను ఇష్టంగా కొనేవారు. బ్రిటిష్ కాలంలో ఆదివాసీల హస్తకళలు ఎక్కువగా ఆదరణ చూరగొన్నాయి. కొయ్య, మట్టి, లోహాలతో ఆదివాసీలు ప్రాణంపోసే బొమ్మలు వారి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. చంద్రశేఖర్ పాటిల్ ఇంట్లోని బొమ్మలను తిలకిస్తున్నప్పుడు.. బొమ్మలతోపాటు చరిత్రా కళ్లముందు కదలాడుతుంది.
బొమ్మలు ఒకనాటి సమాజాన్ని కండ్ల ముందు ఉంచుతాయి. అలనాటి సంస్కృతిని వివరిస్తాయి. వివిధ కాలాల్లో.. మనిషి ఎలా బతికాడో చెప్పకనే చెబుతాయి. కట్టు, బట్ట, అలంకరణ, ఆర్థిక పరిస్థితులు, సంప్రదాయాలను ఎరుకపరుస్తాయి. పిల్లలకు ప్రపంచాన్ని పరిచయం చేయడానికి బొమ్మల కొలువు ఓ చక్కని మార్గం.
“Daily labour App | క్యాబ్ల కోసమే కాదు లేబర్స్ కోసమూ ఓ యాప్.. క్రియేట్ చేసిన జనగామ బిడ్డ”
“komera ankarao | మనుషులకు ఆయువునిచ్చే అడవులకు అండగా మారిన తెలుగోడు”