దేవరుప్పుల, మే 8: తెలంగాణలోని వనరులు దోపిడీకి గురికాకుండా ఉండాలంటే పెద్దదిక్కు బీఆర్ఎస్ అని ప్రజలు ఇప్పటికే గ్రహించారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలయ్యాయని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని 10 ఎంపీటీసీ స్థానాల పరిధిలో మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారితో కలిసి విస్తృత సమావేశాలు నిర్వహించారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష మేరకు ఉద్యమనేత కేసీఆర్ పోరాటంతో స్వరాష్ట్రం సాధించుకున్నామన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి ఐదు నెలల పాలనలో హామీలను నెరవేర్చలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి మోసగించేందుకు అబద్ధాలు ప్రచారం చేస్తూ, కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే మనకు కేసీఆరే శ్రీరామరక్ష అన్నారు. కాంగ్రెస్ పాలనలో సాగు, తాగునీటి సమస్యలతోపాటు కరెంట్ కోతలు నెలకొని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఎర్రబెల్లి తెలిపారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి నిజస్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్నారని .. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.
ఒకప్పుడు ఎడారిని తలపించిన దేవరుప్పుల మండలంలో వాగులపై చెక్డ్యాములు నిర్మించడంతో పాటు దేవాదుల కాల్వ ద్వారా సాగనీరందించడం వల్ల సస్యశ్యామలమైందని ఎర్రబెల్లి తెలిపారు. 15 ఏళ్లలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టిన ఫలితంగా ప్రజలంతా తన వెంట ఉన్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గంలోనే భారీ మెజార్టీ ఇక్కడి నుంచి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంపీపీ బస్వ సావిత్రి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, ప్రధాన కార్యదర్శి చింత రవి, నాయకులు పల్లా సుందరరాంరెడ్డి, బస్వ మల్లేశ్, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.