జమ్మికుంట(హుజూరాబాద్), ఏప్రిల్ 27: ప్రజల కష్టాలు తెలిసినోడ్ని, ఎంపీగా మరోసారి గెలిపిస్తే మీ రుణం తీర్చుకుంటానని బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఓటర్లను కోరారు. శనివారం జమ్మికుంట పట్టణంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావుతో కలిసి నిర్వహించిన మార్నింగ్ వాక్లో వాకర్స్ను కలిసి ముచ్చటించారు. ఎంపీగా తనకు అవకాశం ఇస్తే గతంలో కంటే కరీంనగర్ను మరింత అభివృద్ధి చేస్తానని, పార్లమెంట్లో తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగరవేస్తానని పేర్కొన్నారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కాజీపేట, హసన్పర్తి, హుజూరాబాద్ మీదుగా కరీంనగర్కు రైల్వే మార్గం ఏర్పాటు చేయమని కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చానని తెలిపారు.
హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాలను ట్విన్ సిటీస్గా మారుస్తానని పేర్కొన్నారు. కేంద్రం నుంచి నియోజకవర్గానికి రావాల్సిన నిధులను తప్పక తీసుకువస్తానని, హుజూరాబాద్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో కలిసి పని చేస్తానని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని, అందుకే ఎంపీగా తనను గెలిపించాలని కోరారు.
బండి సంజయ్ ఎంపీగా ఐదేండ్లలో నియోజకవర్గానికి చేసింది శూన్యమని విమర్శించారు. అభివృద్ధి కోసం పైసా కూడా నిధులు తేని ఆయనకు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. తెలంగాణకోసం 32 పార్టీలను కలిసి సంతకాలు పెట్టించామని గుర్తు చేశారు. జిల్లా పరిషత్ సమావేశాలకు ఒక్కసారి కూడా రాని సంజయ్ను గెలిపించి ప్రజలు గోసపడుతున్నారని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కారును నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని పేర్కొన్నారు. ప్రచారం అనంతరం అక్కడే రోడ్డు పక్కన వాకర్స్తో కలిసి వినోద్కుమార్ టిఫిన్ చేసి, ఛాయ్ తాగారు.
ప్రత్యేక రాష్ట్ర సాధనలో బోయినపల్లి వినోద్ కుమార్ కృషి చాలా గొప్పదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. అలాగే గతంలో ఎంపీగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఉప్పల్ బ్రిడ్జి, బిజిగిరి షరీఫ్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు అనేక అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. బండి సంజయ్ ఎంపీగా ఉండి ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ఒకసారి కూడా హుజూరాబాద్ నియోజకవర్గం వర్గానికి రాలేదని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తే కాంగ్రెస్ పాలనలో తిరోగమనం వైపు పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే ఎన్నికల్లో వినోద్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తకళ్లపల్లి రాజేశ్వర్రావు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.