కార్పొరేషన్, మే 7: పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే కరీంనగర్ను అద్భుతంగా తీర్చిదిద్దుతానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ హామీ ఇచ్చారు. ఇప్పటికే తాను మంజూరు చేయించిన స్మార్ట్సిటీ నిధులు వెయ్యి కోట్లల్లో ఇప్పటి వరకు రూ.700 కోట్లు మాత్రమే వ్యయం చేశారని, ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు. నగరంలోని 56 డివిజన్లో గల భాగ్యనగర్ కమ్యూనిటీ హాల్లో మంగళవారం ఆయన డివిజన్ ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ, సీఎం రేవంత్రెడ్డి మనసంతా హైదరాబాద్ చుట్టే ఉంటుందని దుయ్యబట్టారు. హైదరాబాద్ చుట్టు రింగ్ రోడ్డును తీసుకువచ్చి కేంద్ర పాలిత ప్రాంతం చేసే అవకాశం ఉందన్నారు. రేవంత్రెడ్డి తెలంగాణ నుంచి హైదరాబాద్ను వేరు చేసేందుకు కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలంటే తప్పనిసరిగా పార్లమెంట్లో బీఆర్ఎస్ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కరీంనగర్కు అర్హత లేకున్నా స్మార్ట్సిటీ తీసుకువచ్చి వెయ్యి కోట్లు తీసుకువచ్చి అభివృద్ధి చేశామన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు.
పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి గురించి బండి సంజయ్ ఏ రోజు పట్టించుకోలేదన్నారు. నా శ్వాస ఉన్నంత వరకు ప్రజల కోసమే పని చేస్తానన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మధ్య మానేరు ఎండిపోతున్నదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. అనాలోచితంగా ఆలోచన చేసే కాంగ్రెస్తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తున్నదని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, కేసీఆర్ పాలనలో కరీంనగర్ ఏవిధంగా అభివృద్ధి చెందిందో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. నగరాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో తాము పదేళ్ల పాటు వినోద్కుమార్తో కలిసి పని చేశామన్నారు. కరీంనగర్కు స్మార్ట్సిటీ అర్హత లేకున్నా సాధించిన ఘనత వినోద్కుమార్దేనని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు, సాగునీరు అందడం లేదన్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్న వినోద్కుమార్ కొట్లాడి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకువస్తారని పేర్కొన్నారు. నగరంలో అభివృద్ధి కొనసాగాలంటే వినోద్కుమార్ను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు ఎల్ రమణ, భానుప్రసాద్, మేయర్ యాదగిరి సునీల్రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్రావు, నాయకులు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.