కరీంనగర్ కార్పొరేషన్, మే 7 : రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధి, సంక్షేమం జరిగిదంటే అది కేవలం కేసీఆర్ పాలనలోనేనని, అన్ని సమయాల్లోనూ మైనార్టీలకు బీఆర్ఎస్సే అండగా నిలిచిందని రాష్ట్ర మాజీ హోం మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ మైనార్టీల ఓట్లు దండుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. మైనార్టీలకు అండగా నిలిచే బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్కు ఈ ఎన్నికల్లో ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మంగళవారం ఉదయం కరీంనగర్లోని 43, 45 డివిజన్లు కశ్మీర్గడ్డ, అశోక్నగర్, రైతుబజార్ ప్రాంతాల్లో బీఆర్ఎస్కు మద్దతుగా ఇంటింటా ప్రచారం చేశారు. ప్రతి ఇంటికీ వెళ్లి కాంగ్రెస్ వైఫల్యాలను వివరిస్తూ మరోసారి మోసపోవద్దని సూచించారు. ఆ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎప్పటికీ బీజేపీతో కలిసే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్నది కేసీఆర్ మాత్రమేనని గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలోనే ముస్లింల ఆడపిల్లల పెళ్లిల్లకు షాదీముబారక్ ఇచ్చారని, మళ్లీ తిరిగి చెల్లించే అవసరం లేకుండా రుణాలు ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే, వివిధ సంక్షేమ పథకాలను అమలు చేసి మైనార్టీల అభ్యున్నతి కోసం పని చేశారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అక్బర్హుస్సేన్, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, బీఆర్ఎస్ నాయకులు జమీలొద్దీన్, యూసుఫ్, నవాజ్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
అందరికీ అందుబాటులో ఉంటా
నేను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన. కరీంనగర్కు స్మార్ట్సిటీ ద్వారా రూ.వెయ్యి కోట్ల నిధులు తీసుకువచ్చిన. నగరంలోని అన్ని డివిజన్లలోనూ సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సరఫరా చేయించేందుకు ఈ నిధులు వినియోగించిన. నన్ను గెలిపిస్తే పార్లమెంట్లో ప్రజా గొంతుకగా నిలుస్త. ఎప్పుడూ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంట. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజా సమస్యల పరిష్కరానికి కృషి చేస్త. మైనార్టీల సంక్షేమానికి పాటుపడుత.
– బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్