గోదావరిఖని, మే 7 : అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందని, మళ్లీ దొంగ హామీలతో వస్తున్న ఆ పార్టీని తరిమికొట్టాలని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. మన కోసం, మన అభివృద్ధి కోసం పని చేసే నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. మంగళవారం పెద్దపల్లి లోక్సభ పరిధిలో విస్తృత ప్రచారం చేశారు. ఉదయం గోదావరిఖనిలోని కూరగాయల మార్కెట్లో ఓట్లు అభ్యర్థించారు. వ్యాపారులు, కూలీలను ఆప్యాయంగా పలుకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అనంతరం 9వ డివిజన్ పరిధిలోని జనగామలోనూ ప్రచారం చేశారు. శివాలయంలో పూజలు చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. తర్వాత ఖనిలో న్యాయవాదులు, ఆటోడ్రైవర్లతో వేర్వేరుగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. రాత్రి కమాన్పూర్, రామగిరి మండలాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అనేక సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటిలో సంతోషం వెల్లివిరిసిందని తెలిపారు. కానీ, కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.
ఆ పార్టీ అనాలోచిత నిర్ణయాలతో ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆవేదన చెందారు. పంటలు ఎండిపోయి రైతులు చనిపోయినా.. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకన్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. ప్రజలను మోసం చేసిన ఊరుకునేదిలేదని స్పష్టం చేశారు. అబద్ధాలతో గద్దెనెక్కిన ఆ పార్టీని మరోసారి నమ్మి మోసపోవద్దని, ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రైతులు, మహిళలు, యువకులను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్కే దక్కిందన్నారు. ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం ఒకరు, అధికారం కోసం మరొకరి మధ్య జరుగుతున్న పోటీగా ఈ ఎన్నికలను గుర్తించాలని సూచించారు. ప్రజా సమస్యలను పార్లమెంట్లో వినిపించే విధంగా ప్రజా గొంతుక అయ్యే అవకాశం తనకు కల్పించాలని కోరారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ మాట్లాడుతూ, సింగరేణి కార్మికుడిగా పని చేసిన సౌమ్యుడు, పోరాట బిడ్డ కొప్పుల ఈశ్వర్ ఎంపీగా ఉంటేనే మనందరికీ ఒక ధైర్యంగా ఉంటుందని తెలిపారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తున్న ఈశ్వర్కు మద్దతుగా నిలిచి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పెంట రాజేశ్, నాయకులు మారుతి, అచ్చ వేణు, నూతి తిరుపతి, తోట వేణు, వంశీకృష్ణ, కిషన్ తదితరులున్నారు.