భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో డబ్బు, మద్యం అక్రమ రవాణా జరుగకుండా చెక్పోస్టుల వద్ద ఫ్లయింగ్ స్కాడ్ బృందాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక సూచించారు. నియోజకవర్గ, మండల స్థాయి ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ, పోలీస్ సిబ్బందికి ఐడీవోసీలో ఆదివారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. చెక్పోస్టుల వద్ద ప్రతి వాహనాన్నీ నిశితంగా పరిశీలించాలని సూచించారు. మోడల్ కండక్ట్ కోడ్ ఉల్లంఘించిన వారిపై తీసుకున్న చర్యల సమాచారాన్ని నివేదిక రూపంలో అందించాలన్నారు.
ఎటువంటి ఘటనలనైనా సీసీ కెమెరాలు ద్వారా పరిశీలించాలన్నారు. డబ్బు, మద్యం తదితర వస్తువులు పట్టుబడిన సందర్భంలో వీడియో రికార్డింగ్ చేయాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలు మీటింగ్లు, బ్యానర్లు తదితర సామగ్రి పట్టుబడిన సర్వేలైన్స్ అధికారులు రికార్డు చేయాలన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం ప్రజలు రూ.50 వేలు లోపు నగదును తీసుకెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉందని అన్నారు. అంతకుమించిన నగదును తరలిస్తే అధికారులు పట్టుకుంటారని అన్నారు. అప్పుడు ఆ నగదుకు సరైన ఆధారాలు చూపించాలని సూచించారు. ఎన్నికల సూపరింటెండెంట్ దారా ప్రసాద్, ఎన్నికల లైజన్ అధికారి సంజీవరావు, ఎస్ఎస్, ఎఫ్ఎస్టీ బృందాల అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.