Irumudi : భారత పౌరవిమానయాన శాఖ (Indian civil aviation ministry) విమానాల్లో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల (Ayyappa devotees) కు శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పౌర విమానయాన శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప స్వాములు ఇరుముడి (Irumudi) తో ప్రయాణం చేయడానికి అనుమతి ఇచ్చింది.
శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప స్వాములు విమాన ప్రయాణం సమయంలో తమ పవిత్ర ఇరుముడిని (కొబ్బరికాయతో సహా) ఇప్పుడు చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లే విధంగా ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటన విడుదల చేశారు.
ఇప్పటివరకు అమలులో ఉన్న భద్రతా నియమావళి ప్రకారం ఇరుముడిని తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజీగా పంపాల్సిరావడం వల్ల భక్తులు కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. ఈ సమస్యపై తీవ్రంగా దృష్టి సారించిన రామ్మోహన్ నాయుడు.. విమాన ప్రయాణంలో అయ్యప్ప స్వాముల కోసం ప్రత్యేక మినహాయింపు అమలు చేయాలని నిర్ణయించారు.
ఈ ప్రత్యేక సడలింపు ఈ రోజు నుంచి జనవరి 20 వరకు దేశవ్యాప్తంగా వర్తిస్తుందని మంత్రి తెలిపారు. ఈ కాలంలో శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు, ఎయిర్పోర్టు భద్రతా తనిఖీలను పూర్తిచేసిన అనంతరం, తమ ఇరుముడిని చేతి సామానుగా విమానంలో తమతో పాటు తీసుకెళ్లవచ్చని చెప్పారు. అయితే భక్తులందరూ ఎయిర్పోర్టు భద్రతా సిబ్బందికి పూర్తిగా సహకరించాలని సూచించారు.
‘శబరిమల పవిత్ర యాత్రలో పాల్గొనే అయ్యప్ప భక్తుల సౌలభ్యం కోసం, ఇరుముడికి ఉన్న పవిత్రత, భావోద్వేగాల్ని గౌరవిస్తూ.. భక్తులు ఇరుముడిని తమతోపాటు నేరుగా విమానంలో తీసుకెళ్లేలా మా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నా’ అని ఆ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తూనే భక్తుల సాంప్రదాయలు, ఆచారాలకు ఎటువంటి భంగం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. మన దేశం గర్వించే సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలు, భక్తి స్ఫూర్తిని నిలబెట్టే దిశగా మా నిబద్ధతను ఈ నిర్ణయం ప్రతిబింబిస్తుందని చెప్పారు.