శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానంలో ఆర్జిత సేవలను ఈ నెల 12 నుంచి పునరుద్ధరించనున్నట్లు ఆలయ ఈఓ కేఎస్ రామారావు తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. అయితే, ప్రత్యక్ష సేవలు ప్రారంభమైనా.. పరోక్ష సేవలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు.
భక్తులు శ్రీస్వామివారికి అలంకార మండపంలో సామూహిక అభిషేకాలు, అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో కుమార్చనలు, సాక్షిగణపతి ఆలయంలో గణపతి హోమం, శ్రీస్వామివారి యాగశాలలో రుద్రహోమం, మృత్యుంజయహోమం, అమ్మవారి యాగశాలలో చండీహోమం, నిత్యకల్యాణ మండపంలో ఉదయం సుబ్రహ్మణ్యస్వామి, సాయంత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణోత్సవ సేవల్లో పాల్గొనవచ్చని తెలిపారు.
టికెట్లను ms.ap.gov.in లేదంటే www.srisaladevasthanam.org వెబ్సైట్లో, దేవస్థానం వద్ద కౌంటర్లలో బుక్ చేసుకోవచ్చని చెప్పారు. మల్లికార్జున స్వామి వారి సామూహిక అభిషేకాలను మూడు విడుతల్లో ఉదయం 6గంటలకు, 8.30గంటలకు, 11.30గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభిషేక సేవల్లో పాల్గొనే భక్తులకు గతంలో మాదిరిగానే అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నట్లు చెప్పారు.
అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఎనిమిది విడుతల్లో కుంకుమార్చనలు జరుగుతాయన్నారు. సాక్షి గణపతి ఆలయంలో గణపతి హోమం ఉదయం 9 గంటలకు, స్వామి యాగశాలలో రుద్రహోం, మృత్యుంజయ హోమం ఉదయం 8 గంటలకు, అమ్మవారి యాగశాలలో చండీ హోమం ఉదయం 11 గంటలకు జరుగుతుందని చెప్పారు.
ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపంలో ఉదయం 9.30గంటలకు సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం, రాత్రి 7 గంటలకు స్వామి అమ్మవార్ల కల్యాణం నిర్వహించనున్నట్లు ఈఓ వివరించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సేవలను వినియోగించుకోవాలని కోరారు.