శ్రీనగర్ : దక్షిణ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు స్థానిక పోలీసులు, ఆర్మీ రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు ఓ అధికారి తెలిపారు. అనుమానాస్పదంగా ఉన్న ఓ ప్రాంతానికి భద్రతా బలగాలు చేరుకోగానే.. అక్కడ దాక్కొని ఉన్న ఉగ్రవాదులు వారిపై కాల్పులకు దిగారు. భద్రతా బలగాలు సైతం కాల్పులు జరుపడంతో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని అధికారి తెలిపారు.