న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో అధికారులు భారీగా మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. స్పెషల్ పోలీసుల బృందం 350 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నది. దాన్ని విలువ రూ.2,500 కోట్లకుపైగా ఉంటుందని అధికారులు అతెలిపారు. ఈ సందర్భంగా నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలో హర్యానాకు చెందిన ముగ్గురు, ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు ఇంత పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుకోవడం ఇదే తొలిసారి. ఈ కేసులో పోలీసులు నార్కో- టెర్రరిజం కోణాలపై ఆరా తీస్తూ, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ నెల 7న రాజస్థాన్లోని బార్మెర్ జిల్లాలో పాక్ నుంచి తరలిస్తున్న 22 ప్యాకెట్ల హెరాయిన్ను స్వాధీనం చేసుకోవడంతో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పాక్ నుంచి డ్రగ్స్ను అక్రమంగా రవాణా చేసినట్లు వెల్లడించిన నిందితున్ని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్ఓజీ) అరెస్టు చేశాయి. అదే రోజు రూ.7.36 కోట్ల విలువైన హెరాయిన్ను రవాణా చేసేందుకు యత్నించిన జాంబియాకు చెందిన ఇద్దరిని సైతం ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు.