యాంగూన్ : మయన్మార్లో పరిస్థితులు తీవ్రంగా మారాయి. ఆర్మీకి వ్యతిరేకంగా అందగత్తె గళమెత్తింది. సైన్యం అణిచివేత కారణంగా నా సోదరులు, సోదరీమణులు ఎందరో చనిపోతున్నారని, ఇప్పటికైనా అంతర్జాతీయ సమాజం మధ్యవర్తిత్వం నెరిపి ప్రశాంత వాతావరణాన్ని తీసుకురావాలని ఆ అందగత్తె విజ్ఞప్తిచేస్తున్నది.
మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొనేందుకు థాయిలాండ్ వచ్చిన మయన్మార్ సుందరి హాన్ లే.. తన దేశంలో కొనసాగుతున్న సైనిక అణిచివేతను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ వేదికను వినియోగించుకున్నారు. థాయిలాండ్ రావడానికి ముందు ఆమె రోడ్లపైకి వచ్చి సైన్యానికి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ జరిగిన ఆందోళనల్లో పాలుపంచుకున్నారు.
మయన్మార్లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు మంగళవారానికి 66 వ రోజుకు చేరాయి. ప్రజలను అణచివేయడానికి సైన్యం బుల్లెట్లను వినియోగిస్తున్నది. ఇప్పటివరకు 550 మందికి పైగా మయన్మార్ పౌరులు మరణించారు. ఇంత జరిగినా ప్రజలు తలవంచడం లేదు.
‘ఈ రోజు నేను ఈ వేదికపై ఉన్న సమయంలో నా దేశం మయన్మార్లో ప్రజలను చంపేస్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల చింతిస్తున్నాను’ అంటూ హాన్ లే కన్నీరు కార్చారు. ‘దయచేసి మయన్మార్కు సహాయం చేయండి. మాకు అత్యవసరంగా అంతర్జాతీయ సహాయం కావాలి’ అంటూ వేదికపై నుంచి మాట్లాడి ప్రపంచం దృష్టికి మయన్మార్ సమస్యను తీసుకెళ్లగలిగారు.
థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ బ్యూటీ కార్యక్రమం జరిగింది. ఇందులో మిస్ గ్రాండ్ మయన్మార్ 22 ఏళ్ల హాన్ లే పాల్గొన్నారు. ఇదే సమయంలో తమ దేశానికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
నిరసనల్లో పాల్గొన్న 16 ఏళ్ల బాలికను సైన్యం చంపేయడం.. వధను ఆపండి లేదా నన్ను చంపండి.. అంటూ ఒక నన్ సైన్యం ముందు మోకాళ్లపై కూర్చుని వేడుకోవడం ప్రపంచం దృష్టిని ఆకర్శించింది. ఇప్పుడు మయన్మార్ ఆందోళనలో మయన్మార్ అందాల రాణి 22 ఏండ్ల యువతి హాన్ లే పాల్గొనడం హాట్ టాపిక్గా మారింది.
యాంగూన్లో సైకాలజీ చదువుతున్న హాన్ లే.. థాయ్లాండ్లో నిర్వహించే మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలకు హాజరై తమ దేశంలో జరుగుతున్న నరమేధాన్ని ప్రపంచం దృష్టికి తీసుకుపోవాలని నిశ్చయించి ఆ మేరకు విజయం సాధించింది.
‘ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న సైనిక చర్యతో ఆమె భయాందోళనలకు గురవుతున్నారు. ఈ వేదికపై నుంచి ఎక్కువగా మాట్లాడినందున ఇప్పుడే యాంగూన్ రావొద్దని నా స్నేహితురాలు చెప్తున్నది. సైన్యంతో నాకు, నా కుటుంబానికి ప్రమాదం పొంచి ఉన్నది. జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేయడంతో ఈ వేదికపై నుంచి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. మయన్మార్ వెళ్లగానే నా కోసం జైలు గది సిద్ధంగా ఉంటుందని నాకు తెలుసు. అయినా నా దేశ ప్రజలకు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’ అని హాన్ లే థాయ్లాండ్ మీడియా ఎదుట వాపోయారు.
హాన్ లే భయపడటానికి మరో కారణం ఏంటంటే.. సైన్యానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న 18 మంది సెలబ్రిటీలకు సైన్యాధికారులు నోటీసులు జారీ చేశారు. మయన్మార్లో సైనిక తిరుగుబాటు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు శనివారం ఒక్కరోజే 100 కు పైగా ప్రజలు చనిపోయారని స్థానిక మానిటరింగ్ గ్రూపు తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 500 మందికి పైగా పౌరులు చనిపోగా.. వీరిలో 43 మంది చిన్నారులు ఉన్నారని ఆ గ్రూపు వెల్లడించింది.
2036 వరకు రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్
ఇద్దరు ఎంపీల నుంచి కేంద్రంలో అధికారం దాకా.. బీజేపీ ప్రస్థానం.. చరిత్రలో ఈరోజు
వ్యాక్సిన్ వద్దు.. ఆర్థికంగా ఆదుకోండి: ఆఫ్ఘన్ శరణార్థులు
అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్గా చింతన్ వైష్ణవ్
మనుషుల నుంచి పిల్లులు, కుక్కలకు కరోనా: డబ్ల్యూహెచ్వో
వర్చువల్గా పెండ్లి ఉంగరాలు మార్చుకున్న అమెరికన్ జంట
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..