Droupadi Murmu : దేశంలో పేపర్ లీకేజీలను అరికట్టేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ అమెండ్మెంట్ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఆమోదించారు. దీంతో ఇకపై ఈ బిల్లు చట్టంగా అమలులోకి రానుంది. ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) అమెండ్మెంట్ బిల్, 2026’ పేరుతో రూపొందిన ఈ బిల్లును ఈ వారంలోనే పార్లమెంట్ ఆమోదించింది. అటు లోక్సభలో చర్చ అనంతరం ఆమోదం పొందగా, మరుసటి రోజు రాజ్యసభలో కూడా ఆమోదం లభించింది. దీంతో వెంటనే ఈ బిల్లు ఆమోదం కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు పంపింది ప్రభుత్వం.
ఇటీవల నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా సీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఆందోళన గురించి తెలిసిందే. ఈ ఉద్యమం నేపథ్యంలో కేంద్రం పేపర్ లీకేజీలను అరికట్టేలా కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఇదే అంశంలో 2024లో తెచ్చిన బిల్లుకు సవరణలు తెస్తూ కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లును కాంగ్రెస్ సహా అనేక ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఈ బిల్లు ద్వారా పూర్తిస్థాయిలో పేపర్ లీకేజీలను అరికట్టలేమని ప్ర తిపక్షాలు వ్యాఖ్యానించాయి. అయితే, పేపర్ లీకేజీలను అడ్డుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందువల్లే కొత్త బిల్లును రూపొందించామని కేంద్రం సమర్ధించుకుంది. కొత్త బిల్లు ప్రకారం పేపర్ లీకేజీకి పాల్పడితే కఠిన శిక్షలు, జరిమానాలు విధిస్తారు. ఈ బిల్లులోని ప్రధానాంశాలివి. పేపర్ లీకేజీ కేసులను విచారించేందుకు ప్రతి రాష్ట్రంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తారు. 90 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి, శిక్షలు విధించేలా ఈ కోర్టులు నిరంతరం పని చేస్తాయి. పాత బిల్లు ప్రకారం పేపర్ లీకేజీకి పాల్పడితే వ్యక్తిగతంగా రూ.10 లక్షల వరకు జరిమానా విధించేవారు.
కొత్త బిల్లు ప్రకారం రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఒకవేళ సంస్థలు, వ్యవస్థీకృతంగా నేరానికి పాల్పడితే రూ.10 కోట్ల వరకు జరిమానా విధిస్తారు. అలాగే, గతంలో గరిష్టంగా మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు శిక్ష విధించేవారు. ఇప్పుడు ఐదు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఇంతకుముందు కేంద్ర దర్యాప్తు సంస్థలు పేపర్ లీకేజీ కేసులపై విచారణ జరిపేది. కానీ, ఇకపై స్పెషల్ టాస్క్ఫోర్స్ టీంలు ఈ కేసుల్ని విచారిస్తాయి. గతంలో పేపర్ లీకేజీ కేసుల విచారణకు కాల పరిమితి అంటూ లేదు. కొత్త బిల్లు ప్రకారం ఈ కేసుల విచారణను రెండు నెలల్లో పూర్తి చేయాలి.