Amit Shah | ఎన్నికల వేళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)కు సంబంధించిన ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. రిజర్వేషన్లను తొలగిస్తామని షా చెప్పినట్లు కొన్ని వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ అంశంపై తాజాగా అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ( Congress), రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసహనంతోనే ఆ పార్టీ ఫేక్ వీడియోలు తయారు చేస్తోందని మండిపడ్డారు. ఈ ఫేక్ వీడియోను షేర్ చేయడం వెనుక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో రాహుల్ రాజకీయాలను దిగజారుస్తున్నారని ధ్వజమెత్తారు.
‘బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్ను (reservations) తొలగిస్తుందని రాహుల్ అసత్య ప్రచారం చేస్తున్నారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను మా పార్టీ ఎప్పటికీ తొలగించదు. అలాగే ఎవరినీ అనుమతించదు. ఇది మోదీ గ్యారెంటీ. మోదీ రిజర్వేషన్కి మద్దతుదారు. తమకు రెండు దఫాలుగా పూర్తిగా మెజారిటీ దక్కింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లను బీజేపీ తొలగించదు’ అని అమిత్ షా స్పష్టం చేశారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై షా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఫేక్ వీడియోలతో కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. తనతోపాటు కమలం పార్టీకి చెందిన ఇతర నేతల నకిలీ వీడియోలను కూడా ప్రచారం చేసే స్థాయికి దిగజారిందని విమర్శించారు. ముఖ్యమంత్రులు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఇతరులు ఈ ఫేక్ వీడియోను వ్యాప్తి చేశారని మండిపడ్డారు.
అమిత్ షా ఇటీవలే తెలంగాణలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు (reservation quotas) చేస్తామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, షా ప్రసంగాన్ని కొందరు వక్రీకరించి.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పినట్లు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడారని స్పష్టం చేసింది. పూర్తిగా ఎడిట్ చేసిన వీడియోను వ్యాప్తి చేస్తున్నారని, ఇది పెద్ద ఎత్తున హింసకు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
మరోవైపు సోషల్ మీడియాలో వైరలవుతున్న షా ఫేక్ వీడియోపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ మేరకు నకిలీ వీడియోలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హోంశాఖ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ అంశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఢిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మే 1న విచారణకు ఢిల్లీకి రావాలని కోరారు.
Also Read..
Patanjali | పతంజలికి మరో షాక్.. ఆ 14 ఉత్పత్తుల లైసెన్స్ రద్దు చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం