ఆగ్రా : ప్రేమపక్షులు, పర్యాటకులకు శుభవార్త. కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన ప్రేమసౌధం తాజ్మహల్ రెండు నెలల తర్వాత ఈ నెల 16న తెరచుకోనున్నది. తాజ్ మహల్తో పాటు పలు స్మారక చిహ్నాలను తిలకించేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది. కరోనా సెకండ్ వేవ్తో తాజ్ మహల్తో పాటు ఆగ్రా పోర్ట్ ఫతేపూర్ సిక్రీలతో సహా దేశవ్యాప్తంగా స్మారక చిహ్నాలను మూసివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తగ్గుముఖం పడుతుండడంతో పర్యాటక రంగంపై ఆధారపడ్డ స్థానికులు తాజ్ మహల్, ఇతర స్మారక చిహ్నాలను తెరవాలని డిమాండ్ చేశారు.
పర్యాటక రంగంపైనే 2.5లక్షల మందికి ఉపాధి
కరోనా మహమ్మారి ప్రభావంతో గతేడాది మార్చి 17న స్మారక చిహ్నాలను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మూసివేసింది. సుమారు 188 రోజుల తర్వాత సెప్టెంబర్ 21న పర్యాటకుల కోసం తెరిచారు. మళ్లీ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారీగా కేసులు పెరగడంతో గత ఏప్రిల్ 16 నుంచి దేశవ్యాప్తంగా స్మారక చిహ్నాలను వీక్షించేందుకు సందర్శకులకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి నిలిపి వేసింది. సుమారు రెండు నెలల తర్వాత మళ్లీ పర్యాటకులకు అనుమతి ఇవ్వడంతో గైడ్స్, ఫొటోగ్రాఫర్లు, చిన్న చిన్న దుకాణాదారులు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఎంపోరియం దుకాణాలు, హస్త కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రాలో సుమారు 2.5లక్షల మంది ఉపాధి తాజ్మహల్తో పాటు ఇతర స్మారక చిహ్నాలను సందర్శించేందుకు వచ్చే వారిపైనే ఆధారపడి ఉంది.
372 ఏళ్లలో తాజ్ను ఎన్నిసార్లు మూసివేశారంటే..
ప్రేమసౌధం తాజ్ మహల్ 1632 -1648 మధ్య నిర్మితమైంది. అప్పటి నుండి, ఇప్పటి వరకు 372 సంవత్సరాల్లో కేవలం నాలుగుసార్లు మాత్రమే పర్యాటకులు సందర్శించకుండా మూసివేశారు. తొలిసారిగా 1971 ఇండో-పాక్ యుద్ధం సమయంలో రెండు వారాల పాటు మూసివేశారు. 1978 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో యమునా నదికి వరదలు సంభవించిన సమయంలో మరోసారి మూతపడింది. యమునా నదిలో పర్యటస్తూ తాజ్ అందాలను వీక్షించేందుకు పర్యాటకు వచ్చే వారు. భద్రతా కారణాలతో వారం రోజుల పాటు పర్యాటకులకు అనుమతి ఇవ్వలేదు. మూడోసారి కరోనా మహమ్మారితో గతేడాది మార్చి 17 నుంచి సెప్టెంబర్ 20 వరకు మూసివేశారు. 188 రోజుల పాటు మూసివేయడం తాజ్మహల్ చరిత్రలో తొలిసారి. ఈ ఏడాది ఏప్రిల్ 16న మరోసారి కరోనా ప్రభావంతో రెండు నెలలకుపైగా ప్రేమసౌధం తలుపులు మూతపడ్డాయి.