Akhilesh Yadav : కోవిడ్ వ్యాక్సిన్ తయారీ కంపెనీ నుంచి బీజేపీ కోట్లాది రూపాయలు దండుకుని ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడవేసిందని ఎస్పీ చీఫ్, ఆ పార్టీ కన్నౌజ్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్ధి అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. యూపీలోని ఇటావాలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మందులు, ఇతర ఉత్పత్తులను ఎందుకు విక్రయాలకు వారు అనుమతించారని అఖిలేష్ యాదవ్ నిలదీశారు.
కొవిడ్ సమయంలో వ్యాపారుల దందాకు వెసులుబాటు కల్పించిన కాషాయ పార్టీ పట్ల ప్రజల్లో పలు ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో కాషాయ పార్టీని మట్టుకరిపించి కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి (ఎస్పీ) ప్రజల నుంచి మెరుగైన ఆదరణ లభిస్తోందని ఆ పార్టీ ఎంపీ, మొయిన్పురి అభ్యర్ధి డింపుల్ యాదవ్ పేర్కొన్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నానని, ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని చెప్పారు.
మూడో దశలో ఎస్పీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఈసారి మొయిన్పురి నుంచి భారీ ఆధిక్యంతో విజయం సాధిస్తానని డింపుల్ యాదవ్ పేర్కొన్నారు. ఎస్పీ సిద్ధాంతాల ఆధారంగా పనిచేసే పార్టీ అని చెప్పారు. ఎస్పీ, కాంగ్రెస్ కూటమికి ప్రజలంతా మద్దతు తెలుపుతున్నారని వివరించారు. లోక్సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More :
Bajarang Punia | రెజ్లర్ బజరంగ్ పూనియాపై సస్పెన్షన్ వేటు.. పారిస్ ఒలింపిక్స్కు వెళ్లేనా..?