న్యూఢిల్లీ, మే 18: ‘కాలుష్య కాసారంగా ఉన్న గంగా నదిని స్వచ్ఛంగా మారుస్తాం. దీని నీటిని తాగునీటికి సైతం వినియోగించేలా తీర్చి దిద్దుతాం. దీని కోసం ‘నమామి గంగె’ ప్రాజెక్టును చేపడుతున్నాం’ అంటూ పదేండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ అట్టహాసంగా ప్రకటించింది. కట్ చేస్తే.. 10 ఏండ్లు ముగిశాయి. ఇప్పటివరకు ఆ ప్రాజెక్టుపై 40 వేల కోట్లు ఖర్చు పెట్టారు.
ఇంత చేసినా గంగా నది కాలుష్యం భయపెట్టే స్థాయిలోనే కొనసాగుతున్నది. కాలుష్యం కారణంగా నీళ్లు నల్లగానే ఉంటూ తాగడానికి ఏ మాత్రం పనికి రాకుండా ఉన్నాయి. కాలుష్యం అదుపు మాట దేవుడెరుగు.. రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దీంతో ఈ పదేండ్లలో ఖర్చు చేసిన 40 వేల కోట్లు వృథాయేనా? వాటితో ఉపయోగం లేనప్పుడు ఎందుకంత ఖర్చు పెట్టారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సరిగా పనిచేయని మురికి నీటి శుద్ధి ప్లాంట్లు
ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మురికినీటి శుద్ధి ప్లాంట్లు సమర్ధంగా చేయడం లేదనే విమర్శలున్నాయి. అందులో చాలామటుకు మూతపడ్డాయని తెలిసింది. యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు, పైపులైన్ల ప్రాజెక్టులు, నదుల అనుసంధానం వంటివి కూడా గంగా ప్రక్షాళనకు ఆటంకాలుగా మారాయని నిపుణులు పేర్కొంటున్నారు. నమామి గంగ పేరుతో చేపట్టిన గంగా నది ప్రక్షాళనకు అధిక మొత్తం సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీ), నది ఘాట్లకే వెచ్చించినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. అంత చేసినా నదిలోని మురికి నీళ్లు ప్రజలను వెక్కిరిస్తూనే ఉన్నాయి.