శంకరపట్నం, ఆగస్టు 11 : బతికున్న వ్యక్తిని ప్రభుత్వ రికార్డుల్లో మరణించినట్టు నమోదు కావడంతో ఓ దివ్యాంగుడి ఆసరా పింఛన్ మూడు నెలలుగా నిలిచిపోయింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లిలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన తోట శ్రీనివాస్కు మూడు నెలలుగా పింఛన్ రాకపోవడంతో సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించాడు. అయితే రికార్డుల్లో తన పేరు ‘డెత్’గా నమోదైనట్టు గుర్తించాడు. దీనిపై ఎంపీడీవో స్పందిస్తూ తమ సిబ్బంది పింఛన్ను తొలగించలేదని తెలిపారు.
గ్రామ పంచాయతీ కార్యదర్శిని విచారించగా, తన లాగిన్ నుంచి కూడా మరణించినట్టు నమోదు చేయలేదని, మే నెలలో లైవ్ అథెంటిఫికేషన్ కోసం ప్రయత్నించిన సమయంలోనే సిస్టమ్లో ‘డన్’గా చూపించిందని వివరించినట్టు పేర్కొన్నారు. ఇది సాంకేతిక లోపమా? ఇతర కారణాల వల్ల జరిగిందా? అనే అంశంపై జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు ఎంపీడీవో అనిత తెలిపారు. రికార్డును సరిచేసి శ్రీనివాస్ స్టేటస్ను తిరిగి ‘లైవ్’లోకి తీసుకువచ్చి పింఛన్ను పునరుద్ధరించాలని కోరుతూ మంగళవారం ఉన్నతాధికారులకు లేఖ పంపినట్టు వెల్లడించారు.