ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 16 : భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ఖచ్చితమైన భూ రికార్డులను రూపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన భూ రీ-సర్వేకు క్షేత్రస్థాయిలో ఉన్న భూమే ప్రామాణికమని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం గ్రామంలో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను బుధవారం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. రైతులు, భూ యజమానుల సమక్షంలో రోవర్, ట్యాబ్ తదితర ఆధునిక సాంకేతిక పరికరాలతో నిర్వహిస్తున్న డిజిటల్ సర్వే ప్రక్రియను పరిశీలించారు. సర్వే విధానం, ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ రైతులతో నేరుగా మాట్లాడి భూ రీ-సర్వే ఉద్దేశ్యం, చేపడుతున్న ప్రక్రియపై అవగాహన కల్పించారు. రైతుల సందేహాలు, అనుమానాలను అడిగి తెలుసుకుని, వాటిని నివృత్తి చేశారు. సర్వే ప్రక్రియలో ఎలాంటి అపోహలకు తావులేకుండా రైతుల సమక్షంలోనే ప్రతి అంశాన్ని పరిశీలించి నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూమి ఉండి పట్టాదారు పాస్బుక్లు లేని వారు, పట్టాదారు పాస్బుక్లు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయి వివరాలకు రికార్డుల్లోని వివరాలకు పొంతన లేని వారు, అలాగే రికార్డుల్లో భూమి వివరాలు నమోదు కాని సందర్భాలను రీ-సర్వే ద్వారా గుర్తించి, నిబంధనల ప్రకారం పరిష్కరించే అవకాశం ఉంటుందని తెలిపారు.
భూ రీ-సర్వేలో ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఎవరు భూమిని సాగు చేస్తున్నారు, వారి పేరుపై ఎంత విస్తీర్ణం నమోదై ఉంది, పట్టాదారు పాస్బుక్ ఉందా లేదా, రికార్డుల్లో నమోదైన వివరాలు క్షేత్రస్థాయి పరిస్థితులతో సరిపోతున్నాయా అనే అంశాలను సమగ్రంగా పరిశీలించాలని అన్నారు. పట్టాదారు పాస్బుక్లో నమోదైన విస్తీర్ణం, క్షేత్రస్థాయిలో ఉన్న విస్తీర్ణం మధ్య తేడా ఉందా లేదా అనే విషయాన్ని చుట్టుపక్కల రైతుల సమక్షంలో కొలతలు నిర్వహించి నిర్ధారించాలని సూచించారు. అవసరమైన సందర్భాల్లో పంచనామా నిర్వహించి వివరాలను నమోదు చేయాలని, విస్తీర్ణంలో ఎక్కువ లేదా తక్కువ ఉన్నట్లయితే అందుకు గల కారణాలను పూర్తిగా పరిశీలించి, సంబంధిత భూ యజమానికి వివరాలను తెలియజేసి, నిబంధనల ప్రకారం వారి సమ్మతిని నమోదు చేయాలని అన్నారు. ప్రతి భూ రీ-సర్వే సమయంలో సంబంధిత రైతుల వద్ద ఉన్న పట్టాదారు పాస్బుక్లు, పాత పహాణీలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, సాగుకు సంబంధించిన ఇతర ఆధారాలను పరిశీలించి అవసరమైన వివరాలను సేకరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సర్వే నోటీసు అందించినట్లు రసీదు తీసుకోవడం, ఫోటోలతో కూడిన పంచనామా రూపొందించడం, ఆధార్, మొబైల్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయడం వంటి ప్రక్రియలను తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. భూముల వాస్తవ విస్తీర్ణం, హద్దులు, సర్వే నంబర్లు, పట్టాదారు వివరాలను పాత రికార్డులతో సరిపోల్చి ఖచ్చితంగా నమోదు చేయాలని అన్నారు. ఏ ఒక్క అర్హుడి భూమి వివరాలు కూడా రీ-సర్వేలో తప్పిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.
రికార్డుల్లో ఉన్న వివరాలకు, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితులకు మధ్య ఉన్న విస్తీర్ణ తేడాలను సాంకేతికంగా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. మ్యాప్లు, సర్వే నంబర్లు, క్షేత్రస్థాయి కొలతలను సమన్వయం చేసి భవిష్యత్లో భూ వివాదాలకు అవకాశం లేకుండా పక్కా రికార్డులను రూపొందించాలని అన్నారు. ఆధునిక రోవర్, ట్యాబ్ తదితర సర్వే పరికరాలను సమర్థవంతంగా వినియోగించి ప్రతి భూమిని క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా పరిశీలించాలని తెలిపారు. అర్హులైన భూ యజమానులు, సాగుదారులకు భూ హక్కులపై స్పష్టత కల్పించే విధంగా రీ-సర్వే ప్రక్రియను పూర్తి చేసి, అర్హులకు పట్టాదారు పాస్బుక్లు అందేలా రికార్డులను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. రీ-సర్వే సమయంలో రైతులు తమ భూముల వద్ద అందుబాటులో ఉండి సంబంధిత పత్రాలను అధికారులకు అందజేస్తూ పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ వినేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్, సంబంధిత అధికారులు, రైతులు, భూ యజమానులు పాల్గొన్నారు.