తిరుమల : శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి ఏలకలు, వట్టివేరు, ఎండు ద్రాక్ష ( Raisins ), బాదంపిస్తా (Almonds) తదితర సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన మాలలతో బుధవారం స్నపన తిరుమంజనం ( Snapana Tirumanjanam ) భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. తిరుమల ( Tirumala )శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ వైఖానస ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనులను చేసి, రంగురంగుల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, పసుపు, గంధంతో అభిషేకం చేశారు. శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో శాస్త్రోక్తంగా స్నపనం నిర్వహించారు. అభిషేకానంతరం తిరుమల పెద్ద జీయ్యంగార్, చిన్న జీయ్యంగార్లు వివిధ దివ్య పాశురాలను పఠించారు.

ఈ వేడుకలో భాగంగా ఏలకలు, వట్టివేరు, ఎండు ద్రాక్ష, నీలిరంగు పవిత్ర మాలలు, బాదం-పిస్తా మాలలు, పసుపు కొమ్ముల మాలలు, నందివర్ధనం-తామర మాలలు, రోజ్ పెటల్స్తో స్వామి, అమ్మవార్లను అలంకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, బోర్డు సభ్యురాలు సుచిత్ర ఎల్లా, అధికారులు పాల్గొన్నారు.