Viral news : రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య కొనసాగుతున్న వివాదం పెరిగిపెద్దది కావడంతో ఆగ్రహానికి లోనైన భర్త తన భార్య ముక్కు కొరికేశాడు. మంచిర్యాల జిల్లాలోని కొటపల్లి మండలంలో ఇవాళ (బుధవారం) ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. మణిచందర్, మమత దంపతులకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరగగా.. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా కుటుంబకలహాల కారణంగా మమత తన పుట్టింట్లోనే నివసిస్తోంది.
కాపురానికి రమ్మని భర్త ఎంతచెప్పినా ఆమె వచ్చేందుకు నికారిస్తూ వస్తున్నది. ఈ క్రమంలో భార్యను తిరిగి తన వెంట కాపురానికి తీసుకొచ్చేందుకు మణిచందర్ ఇవాళ అత్తగారింటికి వెళ్లాడు. అయితే అతడి భార్య మమతను కాపురానికి పంపేందుకు ఆమె తండ్రి నిరాకరించాడు. దాంతో మామాఅల్లుడి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన మణిచందర్ తన మామపై కర్రతో దాడి చేశాడు.
తన తండ్రిని కొడుతుంటే అడ్డుకునేందుకు ప్రయత్నించిన మమతపై కూడా మణిచందర్ విచక్షణారహితంగా దాడి చేశాడు. అంతటితో ఆగకుండా ఆ కోపంలో ఆమె ముక్కును కూడా కొరికేశాడు. ఈ ఘటనలో బాధితురాలి ముక్కు ముందు భాగం తెగి వేరుపడింది. స్థానికులు వెంటనే స్పందించి బాధితురాలికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఆమెను వరంగల్లోని మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.