కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడి హత్య నేపథ్యంలో ఆయన తల్లికి బీజేపీ టికెట్ ఇచ్చింది. నందిగ్రామ్ నుంచి పోటీకి దించింది. ఈ నేపథ్యంలో లక్షకు పైగా మెజారిటీతో తాను గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. (Suvendu Adhikari aide’s mother) బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం సువేందు అధికారి రెండు స్థానాల్లో గెలిచారు. అయితే భబానీపూర్ స్థానాన్ని ఉంచుకున్న ఆయన నందిగ్రామ్ స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
కాగా, సీఎం సువేందు అధికారి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన చంద్రనాథ్ రాత్, మే 6న మధ్యమ్గ్రామ్లో కారులో ప్రయాణిస్తుండగా బైకులపై వచ్చిన దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు.
తొలుత సిట్ దర్యాప్తు చేసిన ఈ కేసును తర్వాత సీబీఐకి అప్పగించారు. అయితే చంద్రనాథ్ రాత్ తల్లి హసిరాణి రాత్ను నందిగ్రామ్ బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ మంగళవారం ప్రకటించింది. ముర్షిదాబాద్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు సఖారావ్ సర్కార్ను రెజినగర్ అసెంబ్లీ స్థానానికి పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసింది.
మరోవైపు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన నందిగ్రామ్ స్థానం టికెట్ తనకు కేటాయించిన బీజేపీకి హసిరాణి రాత్ కృతజ్ఞతలు తెలిపారు. హల్దియాలో ఆమె నామినేషన్ను దాఖలు చేశారు. 1998 నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉన్న తాను రెండుసార్లు పంచాయతీ సభ్యురాలిగా, మూడుసార్లు పంచాయతీ సమితి సభ్యురాలిగా సేవలందించినట్లు హసిరాణి తెలిపారు. నందిగ్రామ్ ఉప ఎన్నికలో 1.1 లక్షల భారీ మెజారిటీతో తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తన కుమారుడి హత్య కేసు విచారణలో సీఎం సువేందు అధికారిపై తమ కుటుంబానికి పూర్తి నమ్మకం ఉన్నదని ఆమె అన్నారు.